MLA Rajasingh | పార్టీ మార్పుపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఇక గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో రాజాసింగ్ చేరుతున్నారంటూ ఇటీవల ప్రచారం జోరుగా సాగగా… ఈ వార్తలపై ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని శనివారం తేల్చి చెప్పారు. తానుఎట్టి పరిస్థితుల్లోనైనా బీజేపీని వీడే ప్రసక్తే లేదన్నారు.
ఓ వర్గంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఇటీవల కాలంలో రాజాసింగ్ పేరు మారుమ్రోగింది. తాను చేసిన ఆ కామెంట్స్ సంచలనంగా మారడంతో ఆయనపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. ఈ క్రమంలో పార్టీ నుండి రాజాసింగ్ను సస్పెండ్ చేసింది బీజేపీ. ఈ విషయం జరిగి నెలలు గడుస్తున్నా తన విషయంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మనస్థాపంతో టీడీపీలో చేరబోతున్నారంటూ పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్తో సైతం చర్చలు జరిపాడని వార్తలు వినిపించాయి. స్థానిక రాజకీయాలలో ఇలా అనేక ఊహాగానాలు ఉండడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు.