ఈవీఎం ధ్వంసం ఉదంతంపై ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామ కృష్ణారెడ్డి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటి స్తుందా? అని ప్రశ్నించారు. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుందని నిలదీశారు. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుందని అడిగారు.
మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుం దని తెలిపారు. అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదని సజ్జల ప్రశ్నించారు. అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ ఒక చిన్న క్లిప్పింగ్ను మాత్రమే బయటకు ఎలా వస్తుందని నిలదీశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తిం చేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే, అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదని అడిగారు. దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదని సజ్జల ప్రశ్నించారు.


