తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం కేరళ వెళ్లనున్నారు. వయనాడ్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రానికి ఆయన హాజరుకానున్నారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్తోపాటు రాయ్ బరేలీ స్థానం నుంచి పోటీ చేసి, రెండుచోట్లా విజయం సాధించారు. అయితే రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
వయనాడ్ ఉపఎన్నిక గెలుపు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో వయనాడ్ సీటును గెలిచేందుకు కాంగ్రెస్ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గాంధీ కుటుంబాన్ని రాయ్ బరేలి, అమేథీ తర్వాత అక్కున చేర్చుకున్న నియోజకవర్గం వయనాడ్. 2019లో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి పాలవగా, వయనాడ్ మాత్రం అఖండ విజయాన్ని అందించింది. 2024 లోకసభ ఎన్నికల్లోనూ అక్కడి ప్రజలు రాహుల్ని అక్కున చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే వయనాడ్ సీటును గెలిచేందుకు కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.