స్వతంత్ర వెబ్ డెస్క్: ఇటీవల తాను అమెరికాలో విద్యుత్ గురించి మాట్లాడిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వివిరిస్తుంటే బీఆర్ఎస్ మంత్రులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో వాస్తవాలు చెప్పే అవకాశం ఇవ్వకపోయిన ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉంటాయా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటీవల భారీ వర్షాలతో రాష్ట్రాన్ని వరదలు కుదిపేశాయని.. వరద బాధితులను ఆదుకొని ఉంటే సీతక్క లాంటి ఎమ్మెల్యేలు కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. వాస్తవానికి వరద బాధితుల ప్రాంతాల్లో తిరగాల్సిన బీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వీధుల్లో తిరుగుతున్నారని అన్నారు. వరద బాధితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని.. ప్రభుత్వాన్ని ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నలు వేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారా.. అసలు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారా లేరా అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలోని దాసరి మనోహర్ రెడ్డి చివరికి దేవుని మాన్యాలను కూడా వదలడం లేదని అన్నారు. ఈసారి మనోహర్ రెడ్డిని ఆ దేవుడు కూడా కాపాడలేడని పేర్కొన్నారు. ప్రజల్లో ఉండి తాము ప్రజల కోసం కొట్లాడుతున్నామని.. మీ కోసం మేముంటామని.. తమకోసం ఉండాలని ప్రజలను రేవంత్ కోరారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని అన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దాదాపు 10 వేల వరకు ఎకరాలు కబ్జా చేసిందని ఆరోపించారు. అలాగే లక్ష కోట్లు వెనకేసుకున్నారని.. ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని అన్నారు.