ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగింది తప్ప ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూడొచ్చని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగినా సరే.. హామీ నిలబెట్టుకున్నారు తప్ప సోనియా గాంధీ వెనుకడుగు వేయలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రెస్మీట్లో మాట్లాడారు.
ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ” ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా మోదీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదు. ఇద్దరూ కలిసి ఢిల్లీని నాశనం చేశారు. ఇద్దరూ వేరు కాదు… ఒక్కటే. ఢిల్లీని బాగుచేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే. భారత్ జోడో యాత్ర సమయంలో, ఎన్నికల సమయంలో 5 గ్యారంటీలు హామీ ఇచ్చాం. వాటిని విజయవంతంగా అమలుచేసి చూపించాం. ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నాం. ఢిల్లి జనం కాంగ్రెస్ను గెలిపించాలి.
తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాను. తెలంగాణలో ఒకేసారి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ అన్నారు. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇచ్చింది మాత్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తెలంగాణాలో అందిస్తున్నాం”.. అని రేవంత్ రెడ్డి చెప్పారు.