ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దానిపై ఆయన కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. నిజంగా ధైర్యం ఉంటే తాను మెట్రోను అడ్డుకున్నా అనే విషయం నిరూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మెట్రోపై ప్లానింగ్ ఉందా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీని అడిగి కాంగ్రెస్ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చారా అని కిషన్రెడ్డి నిలదీశారు. హామీల, పథకాల అమలు విషయంలో తమపై తోసేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. పథకాలకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రధానికి కాగితం ఇవ్వగానే పనులు అయిపోతాయా అని నిలదీశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం సీఎం రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్పై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయంటూ సీఎం వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. న్యాయవాది సంజీవరెడ్డి కోర్టులో వాదిస్తూ అందరి ముందే ఆరు నెలల క్రితమే గుండె పోటుతో మరణించారన్నారు. భూపాలపల్లిలో భూతగాదాల వల్లనే రాజలింగమూర్తి హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ చెప్పారన్నారు. దుబాయ్లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లోనే వచ్చిందన్నారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.
ప్రతీ విషయంలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారన్నారన్నారు కవిత. అహంకారానికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ రేవంత్రెడ్డి అని విమర్శించారు. బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారన్నారు. తాము వాస్తవాలు బయటపెట్టగానే బీజేపీ నాయకులు మమ్మల్నే విమర్శిస్తారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందన్నారు. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్పై కేసులు పెడుతామని రేవంత్రెడ్డి అంటున్నారన్నారు. లేనిపోని విషయాలు తెచ్చి తమకు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్పా సీఎంకు ఇంకో ఆలోచన లేదని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబమన్నారు కవిత.
రాష్ట్ర అప్పులు..ఆదాయంపై రేవంత్రెడ్డి అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కవిత విమర్శించారు. ప్రధానిని కలిసిన సందర్భంలో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ నెలకు 6 వేల 500 కోట్ల రూపాయలు కడుతున్నామని చెప్పారని అన్నారు. కాగ్ నివేదిక ప్రకారం 10 నెలల్లో 22వేల కోట్లు వడ్డీ మాత్రమే కట్టారని చెప్పారన్నారు. నెలవారీ వడ్డీ చెల్లింపు 2 వేల 600కోట్ల రూపాయలు మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ 7లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని కవిత మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి హైడ్రా కారణమని అన్నారు.