స్వతంత్ర, వెబ్ డెస్క్: ఐదు వందల రూపాయల నోటుపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోట్లను ఉపసంహరించుకునే ఆలోచన లేదని, అలాంటి ఊహాగానాలు చేయవద్దని ప్రజలను కోరుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ రూ.500 నోట్లను చెలామణి నుంచి రద్దు చేయడం లేదా 1000 రూపాయల నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడం గురించి ఆలోచించడం లేదని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. 2024 ఆర్థిక సంవత్సరం కోసం రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆవిష్కరించిన తర్వాత దాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. వడ్డీ రేట్లను యథాతంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం గృహరుణాలు తీసుకునేవారికి అనుకూలమని చెబుతున్నారు. ప్రస్థుతం వడ్డీరేట్లు బ్యాంకుల్లో సింగిల్ డిజిట్లలోనే కొనసాగుతున్నాయి.