స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీకి జగన్ భవిష్యత్ కాదని..విపత్తు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను పదవులపై ఆశపడి రాజకీయాల్లోకి రాలేదని, వైసీపీ కేసులకు తాను భయపడనని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర కృష్ణా జిల్లా పెడనలో సాగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ ఓట్ల కోసమే పథకాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ది రూపాయి పావలా ప్రభుత్వమని విమర్శించారు. సీఎం జగన్ ఒంట్లో పావలా దమ్ము లేదన్నారు. రాష్ట్రంలో రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమేనన్నారు. డబ్బులిస్తే అభివృద్ధి జరిగినట్టా ? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మార్గాలేవని నిలదీశారు. తాను పదవులపై ఆశపడి ఉంటే 2009లోనే ఎంపీ పదవిలో ఉండేవాడినన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్ట కొట్టిందన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎక్కువ రాజద్రోహం కేసులు ఏపీలోనే పెట్టడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి కేసులకు భయపడితే తాను రాజకీయాల్లోకి ఎందుకు వస్తానన్నారు.