వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. కడప జిల్లా పులివెందులలోని డిగ్రీ కాలేజ్ దారిలో ఉన్న సమాధుల వద్ద తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యుల ఆధ్వర్యంలో వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీ పోస్ట్ మార్టం నిర్వహించారు. రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన భర్య సుశీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సందేహాల నివృతి కోసం మరోసారి పోస్టుమార్టం చేశారు. మరోవైపు రంగన్న మృతిపై రాష్ట్ర కేబినెట్ మంత్రులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
వైసీపీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాచ్మెన్ రంగన్న ప్రధాన సాక్షిగా ఉన్నారు. నిన్నటి ఏపీ కేబినెట్లో రంగన్న మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేబినెట్ భేటీలో అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత వివేకా హత్య కేసును స్వయంగా చంద్రబాబే ప్రస్తావించారట. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న మృతి చెందడం అనుమానాస్పదంగానే ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమేనని కూడా ఆయన అన్నారు.అక్కడే ఉన్న డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా రంగన్న మృతిపై సమగ్ర వివరాలను మంత్రుల ముందు పెట్టారట. చంద్రబాబు అనుమానించినట్లే రంగన్న మృతి అనుమానాస్పదంగానే ఉన్నట్లు తమ విచారణలోనూ తేలిందని కూడా డీజీపీ చెప్పారట.
ఇక వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా చనిపోవడంపై కూడా చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటికే కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి , కల్లూరి గంగాధరరెడ్డి , ఆ తర్వాత డ్రైవర్ నారాయణ, వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారు. ఇక తాజాగా ప్రధాన సాక్షి అయిన వాచ్ మెన్ రంగయ్య మృతి చెందడంతో ఇప్పటివరకు ఈ కేసులో సాక్షులుగా ఉన్న ఐదుగురు మరణించినట్టైంది. అందరూ అనారోగ్య కారణాలతోనే చనిపోయారు. వివేకా హత్య కేసులో ఇలా వరుసగా సాక్షులు చనిపోతే కేసు ఎలా నిలబడుతుంది? అని చంద్రబాబు ఆశ్చర్యంగా అన్నారని తెలిసింది. దీన్ని బట్టి మరణాల వెనుక మిస్టరీ ఉందన్న అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి.