స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రెండు వేల రూపాయల నోట్ల రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పష్టత ఇచ్చింది. రూ.2000నోట్లు రద్దు చేయలేదని ఉపసంహరణ మాత్రమే చేశామని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెల చివరి వరకూ బ్యాంకుల్లో మార్చుకోవచ్చని సూచనలు చేసింది. ఒకవేళ ఆ తర్వాత మార్చుకోకపోయినా రోజువారీ లావాదేవీలు జరుపుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. అయితే గడువులోగా మార్చుకుంటే మంచిదని సూచించింది. సెప్టెంబర్ 30 తర్వాత కూడా బ్యాంకుల్లో రూ.2000 నోట్లను ఖాతాల్లో జమచేసుకోవచ్చు.. కానీ ఇతర నోట్లలోకి మార్పిడి చేసుకోడానికి మాత్రం అవకాశం ఉండదని స్పష్టంచేసింది. ఈ మేరకు RBI ఓ నోట్ను విడుదల చేసింది.
మే 23 నుంచి ఒకేసారి రూ.20,000 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. ఖాతా ఉన్న బ్యాంకులోనే కాకుండా ఏ బ్యాంక్ బ్రాంచ్లోనైనా బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా కూడా గరిష్టంగా రోజుకు రూ.4వేల వరకు ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయదల్చుకుంటే ఎలాంటి పరిమితులూ ఉండవు. ఎంత మొత్తంలోనైనా రూ.2000 నోట్లను జమ చేయడంతో పాటు డ్రా కూడా చేసుకోవచ్చు.
సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోసం బ్యాంకు అధికారులే ప్రత్యేక సౌకర్యాన్ని ఏర్పాటుచేస్తారు. నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేసుకోడానికి బ్యాంకులు నిరాకరించకుండా ఇప్పటికే ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏవైనా సమస్యలుంటే రిజర్వ్ బ్యాంక్కు చెందిన ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ కింద ఫిర్యాదు కూడా చేయవచ్చు.