తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్, రంగారెడ్డి, హైదారాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో కొనసాగిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 23న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ 24న ఉదయానికి తీవ్ర తుపానుగా ఉద్ధృతి చెంది ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాన్ని తాకనుంది. ఈ నెల 25న ఉదయం పూరి, సాగర్ ఐలండ్స్ మధ్య దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.