స్వతంత్ర వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఢిల్లీ-ఎన్సీఆర్ లో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ఢిల్లీలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు యమునా నది లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం 7 గంటలకు నదిలో నీటి మట్టం 205.45 మీటర్లుగా ఉంది.
ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, ఘజియాబాద్ లో కూడా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎడతెరిపి లేని వర్షంతో రెండు నగరాలు అతలాకుతలమయ్యాయి. ప్రధాన రహదారులు సహా కాలనీలన్నీ నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా హిండన్ నది నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో సమీపంలోని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నది నీటిమట్టం పెరగడంతో ఎకోటెక్ 3 సమీపంలోని ప్రాంతం పూర్తిగా వరదలో చిక్కుకుపోయింది. దీంతో చాలా వాహనాలు వరద నీటిలో మునిగి తేలియాడుతున్నాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.