అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం పర్యటించారు. ఆయన కచార్ జిల్లాలో సిల్చార్ను సందర్శించారు. ఎయిర్పోర్టులో అస్సాం, మణిపుర్ కాంగ్రెస్ నేతలు ఆయన్ను కలిశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో ఆయన మాట్లాడారు. అనంతరం హింసతో అట్టుడుకుతున్న మణిపుర్కు ఆయన ప్రయాణమయ్యారు. అక్కడ జిబామ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత చురాచాంద్పుర్, మోయిరాంగ్లో శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. సాయంత్రం ఆయన రాజ్భవన్లో గవర్నర్ను కలసిన అనంతరం విలేకర్ల సమావేశం నిర్వహిస్తారు.
అస్సాంలో వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కామ్రూప్, నాగౌన్, కచార్, ధుబ్రి, గోల్పరా, మెరిగావ్, హైలాకండి, దక్షిణ సల్మార, దిబ్రూగఢ్ సహా పలు జిల్లాలు వరదల దెబ్బకు అతలాకుతలం అయ్యాయి. బ్రహ్మపుత్ర, బరాక్లతో కలిపి మొత్తం ఆరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కామ్రూప్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాష్ట్రంలో వేల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరదల కారణంగా 63 వేల 490 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. అత్యధికంగా ధుబ్రి జిల్లాలో 7 లక్షల మందికి పైగా ప్రభావితమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత దర్రాంగ్లో లక్షా 86 వేల108.. బార్పేటలో లక్షా 39 వేల 399.. మెరిగావ్లో లక్షా 46 వేల 45 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 47వేల 103 మంది వరద బాధితులు 612 సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఆరుసార్లు వరదలు సంభవించాయి.