పూణే బస్ స్టాండ్లో ఘోరం జరిగింది. ఆగిఉన్న బస్సులో ఓ యువతిపై అత్యాచారం చేశాడో దుర్గార్గుడు. అత్యాచారం చేసిన నిందితుడు దత్తాత్రేయ రామ్ దాస్ గడేను పట్టుకోవడానికి పోలీసులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటించారు. దత్తాత్రేయ రామ్దాస్ గడే.. మంగళవారం ఉదయం 27 ఏళ్ల యువతిని అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు. పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో ఉన్న ఎప్పుడూ రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్లో ఆగి ఉన్న బస్సులో యువతిపై అత్యాచారం చేశాడు.
36 ఏళ్ల గడేకు క్రిమినల్ రికార్డు ఉంది. పూణే సమీపాన ఉన్న అహల్యానగర్ జిల్లాలో కనీసం ఆరు దొంగతనాలు, దోపిడీ , గొలుసు దొంగతనాల కేసులు ఉన్నాయి. 2019 నుంచి నిందితుడు బెయిల్పై ఉన్నాడు. ఘటన జరిగిన తర్వాత అతను పరారయ్యాడు. 48 గంటలుగా పోలీసులు గడే కోసం వెదుకుతున్నారు.
నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఎనిమిది క్రైమ్ బ్రాంచ్ బృందాలు ఉన్నాయి. గాలింపులో భాగంగా నిందితుడి సోదరుడు సహా కుటుంబ సభ్యులు స్నేహితులను పోలీసులు విచారించారు.
మంగళవారం ఉదయం 5.45 నుంచి 6 గంటల మధ్య ఈ అత్యాచారం జరిగింది.
బాధిత యువతి సతారా జిల్లాలోని తన సొంతూరుకు వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా… గాడే తనను అడ్డుకున్నాడని.. నిందితుడు ఆమెను ‘దీదీ’ లేదా ‘సోదరి’ అని సంబోధించాడని ఆమె పోలీసులకు తెలిపింది.
గాడే.. తన దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్తుందీ ఆరా తీశాడని.. రద్దీగా ఉండే డిపోలో ఒక మూలన ఆగి ఉన్న బస్సు తనను సొంతూరికి తీసుకెళ్తుందని ఒప్పించాడని ఆమె చెప్పింది. సీసీటీవీ ఫుటేజ్లో ఇద్దరూ ఆ బస్సు వైపు నడుస్తున్నట్లు కనిపించింది.
బస్సు బయట లైట్లు లేకపోవడంతో బాధితురాలు బస్సు ఎక్కేందుకు సంకోచించానని.. అయితే ప్రయాణికులు అందులో నిద్రపోతున్నారని, బస్పు ఎక్కాలని నిందితుడు చెప్పినట్టు బాధితురాలు వాపోయింది.
బస్సు ఎక్కిన వెంటనే ఎగిరి మరీ బస్సు డోర్ లాక్ చేశాడని.. తర్వాత తనపై అత్యాచారం చేశాడని.. దాడి తర్వాత గడే పారిపోయాడని పోలీసులకు చెప్పింది. బాధితురాలు జరిగిన విషయం తన స్నేహితురాలికి చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించిందని తెలిపింది.