2024 లోక్ సభ ఎన్నికలు చివరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఒక పక్క జూన్ 1న 7వ దశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తికాగా, మరో పక్క జూన్ 4న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జూన్ 1న మొత్తం 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో లోక్ సభలోని మొత్తం 543 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
జూన్ 1న బీహార్ లో 8 నియోజకవర్గాలు, హిమాచల్ ప్రదేశ్ లోని మొత్తం 4 లోక్ సభ నియోజకవర్గాలు, జార్ఖండ్ లో 3 స్థానాలకు, ఒడిశాలో 6, పంజాబ్ లోని మొత్తం 13 నియోజకవర్గాలు, ఉత్తరప్రదేశ్ లోని 13 నియోజకవర్గాలు పశ్చిమ బెంగాల్ లో 9 స్థానాలకు, చండీగఢ్ లోని ఏకైక నియోజవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 7 రాష్ట్రాలు, చండీగఢ్ కలిపి మొత్తం 57 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సర్వసన్నాహాలు పూర్తయ్యాయి. నేటి సాయంత్రంతో ఈ నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది.
ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాశి తో సహా ఉత్తరప్రదేశ్ లోని 13 నియోజకవర్గాలకు జూన్ 1న ఏడోవిడతలో ఎన్నికలు జరుగుతుండడం విశేషం. వారణాశిలో 2014 నుంచి మోదీ హవా కొనసాగుతోంది. ఇక గోరఖ్ పూర్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత ఊరు. 2014,2019 లో లో వరుసగా ఇక్కడ బీజేపీనే నెగ్గింది. నటుడు సిటింగ్ ఎంపీ రవి కిషన్ మళ్లీ పోటీ చేస్తున్నారు. గౌతమ బుద్ధుడు మహా పరినిర్వాణం పొందిన స్థలం ఖుషి నగర్. ఇక్కడ బీజేపీకి రెండు టర్మ్ లుగా తిరుగులేదు. బలియా నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ బీజేపీ నుంచిపోటీ చేస్తున్నారు. ఆయన రెండు సార్లు ఇక్కడి నుంచి పోటీ చేశారు. మరో టర్మ్ కు సిద్ధమవుతున్నారు. బీజేపీ తో ఇండియా కూటమి నుంచి అఖిలేశ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తున్నాయి. మాయావతి బీఎస్పీ మరో కీలక పోటీ దారుగాఉంది.
2022లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న తొలి లోక్ సభ ఎన్నికలు ఇవి. సిమ్లా, మండీ, కాంగ్డా, హమీర్ పూర్ మొత్తం నాలుగు స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తుంటే.. సినీ నటి కంగానా రానౌత్ ను బీజేపీ రంగంలోకి దించి.. ఆమె గ్లామర్ నూ మోదీ ఛరిష్మాకు వినియోగించుకుని విజయం సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 2009 నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన హమీర్ పూర్ నియోజకవర్గం నుంచి మళ్లీ మరోసారిపోటీ పడుతున్నారు. కంగ్దా నుంచి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద శర్మ పోటీ పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో చాలా మంది సైన్యంలో సేవలు అందిస్తారు. అగ్నివీర్ పథకం తో చాలా మంది సైన్యంలో చేరాలనుకునే యువకులు అసంతృప్తితో ఉన్నారు. బీజేపీకి అదో మైనస్ పాయింట్ కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆ పార్టీకీ ఓట్లు కురిపించవచ్చు.
ఢిల్లీ తర్వాత ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వ ఉన్న రాష్ట్రం పంజాబ్. ఆమ్ఆద్మీపార్టీ సర్కార్ ఏర్పడిన తర్వాత లోక్ సభ ఎన్నికలు ఇవి. జూన్ 1న జరిగే ఎన్నికల్లో 13 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వామ్యులు అయినా.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీ, శిరోమణి అకాలీ దళ్ మధ్య చతుర్ముత పోటీలు జరుగుతున్నాయి. 2019లో మొత్తం 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధిస్తే.. మిగతా స్థానాలను బీజేపీ, శిరోమణి అకాలీదళ్, ఆప్ గెలుచుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ బీజేపీ తరుపున పాటియాలా నుంచి పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు దివంగత అరుణ్ జైట్లీ పోటీ చేసిన అమృత్ సర్ నుంచి బీజేపీ గతంలో అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన తారణ్ జిత్ సింగ్ సంధును అభ్యర్థిగా నిలిపింది. చండీగఢ్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీశ్ తివారీ, బీజేపీ తరుపున సంజయ్ టాండన్ పోటీ పడుతున్నారు. గతంలో పోటీ చేసిన నటి కిరణ్ ఖేర్ ను తప్పించి గతంలో చత్తీస్ గఢ్ మాజీ గవర్నర్ బలరామ్ జీదాస్ టండన్ కుమారుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. సైన్యంలో సిక్కులు కీలకం. ప్రత్యేక సిక్ రెజి మెంటే ఉంది. ఇక్కడి నుంచి సైన్యంలో చేరే వారు ఎక్కువ మోదీ సర్కార్ తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ను యువత వ్యతిరేకిస్తున్నారు. అదీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవచ్చు.
బీహార్ లో 8 లోక్ సభ నియోజకవర్గాలకు చివరి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 8 చోట్ల 134 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. జేడీయూతో బీజేపీ తాజాగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు బీజేపీ, జేడీయూ కూటమికి ప్రతిష్టాత్మకమైనవి. ఎన్డీఏ -ఇండియా కూటమి మధ్యే కీలక పోరు. బీహార్ లో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, మాజీ స్పీకర్ మీరా కుమార్ కుమారుడు, దివంగత డిప్యూటీ ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ మనుమడైన అన్షుల్ అభిజీత్ ఉన్నారు.
బెంగాల్ ఆఖరి పోరుకు సిద్ధమైంది. జూన్ 1న 9 స్థానాలకు పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ జరుగుతుంది. 2019లో ఈ స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ మొత్తం గెలుచుకోవడం విశేషం. తృణమూల్, బీజేపీ మధ్య తీవ్ర వివాదాలతో సాగిన ఎన్నికలు ఏడో విడతతో పూర్తవుతాయి. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు , 2014,2019లో నెగ్గిన అభిషేక్ బెనర్జీ కే ఈ సారి డైమండ్ హార్బర్ తృణమూల్ మళ్లీ టికెట్ కేటాయించింది. ఈ సారి బీజేపీ నుంచి తృణమూల్ గట్టి పోటీ ఎదుర్కొంది. విజయం ఎవరిదో చూడాలి.