భారత్లో తొలిసారిగా నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది. పశ్చిమబెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాలో నిర్మించిన తొలి అండర్వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కోల్కతా ఈస్ట్ – వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల వ్యయం తో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్కతా ఈస్ట్ – వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. 10.8 కి.మీ. భూగర్భం లో ఉంటుంది. ఇందులో హావ్డా మైదాన్ నుంచి ఎస్ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కి.మీ.ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రోరైలు కోల్కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు కాగా, బాహ్య వ్యాసం 6.1 మీటర్లు. నదీగర్భానికి 16 మీటర్ల దిగువన, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం హావ్డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90నిమిషాల సమయం పడుతోంది. అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40నిమిషాలకు తగ్గనుంది. ఈ కారిడార్ పరిధిలో ఎస్ప్లెనెడ్, మహాకారణ్, హావ్డా, హావ్డా మైదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి.
మెట్రో టన్నెల్ లోపలికి నీరు చొచ్చుకురాకుండా 1.4 మీటర్ల వెడల్పాటి కాంక్రీటు రింగులను అమర్చారు. నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్ గాస్కెట్లను ఏర్పాటు చేశారు. ఈ తరహా సాంకేతికత ను యూరోస్టార్ అనే కంపెనీ లండన్, ప్యారిస్ నగరాల మధ్య రాకపోకల కోసం అభివృద్ధి చేసింది. ప్రతిష్ఠాత్మక హుగ్లీ అండర్వాటర్ మెట్రో ప్రాజెక్టుతో భారత్కూ ఈ ఘనత దక్కింది. టన్నెల్ను తవ్వడానికి బాహుబలి యంత్రాలను వాడారు. జర్మనీలో రూపొందించిన టన్నెల్ బోరింగ్ మిషన్ సహాయంతో నిర్మాణపనులను త్వరగా పూర్తి చేశారు. కేవలం 66 రోజుల్లోనే ఆ యంత్రం సొరంగాన్ని తవ్వింది. ఈస్ట్ – వెస్ట్ మెట్రో కారిడార్ పనులు 2009లో మొదలుకాగా, హుగ్లీ నదిలో టన్నెల్ నిర్మాణపనులు 2017లో ప్రారంభించారు. ఈ అండర్వాటర్ మెట్రో మార్గం చుట్టుపక్కల పలు చారిత్రక కట్టడాలున్నాయి. వాటికి ఎటువంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటూ మెట్రో అధికారులు పనులు పూర్తి చేశారు.
కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి అత్యవసర సమయాల్లో మెట్రో ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలకు గురవకుండా పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యల నుంచి సులువుగా బయటపడేలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని కోల్కతా మెట్రో జనరల్ మేనేజరు ఉదయ్కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు కనీసం 7 లక్షల మంది ప్రయాణికులు అండర్వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా ఉందన్నారు. దేశంలో తొలిసారి 1984లో మెట్రో రైలు సేవలు కోల్కతాలోనే మొదలయ్యాయి. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ నగరం మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. ఈ వినూత్న ప్రాజెక్టుతో కోల్కతాలో ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం తగ్గుతాయి.