లోక్ సభ ఎన్నికల వేళ .. సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సిన సమయంతో బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొం టోంది. ఒకప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీలకు గండి కొట్టిన బీఆర్ ఎస్ ప్రస్తుతం కీలక నాయకులు వలసబాట పట్టడంతో రేకులు రాలిపోయిన గులాబీ చందంగా మారింది. రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో వలసల వరదతో.. గులాబీ దండు ఖాళీ అయిపోతోంది. కార్ పంచర్ అయింది!
బీఆర్ ఎస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బనుంచి ఇంకా కోలుకోని కేసీఆర్ పార్టీలో కీలక నాయకులు ఘర్ వాపసీ పేరుతో వలసపోవడం ఆందోళన కల్గిస్తోంది. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీ రివెంజ్ పాలిటిక్స్ కు ఉద్యమపార్టీ కుదేలయిపోతోంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రజల మన్ననలు పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి .. అధికారంలోకి రాగానే.. “ఆపరేషన్ ఆకర్ష్” పేరుతో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ఇతర పార్టీ నేతలకు రెడ్ కార్పెట్ పరచింది. అనుకున్నదే తడవుగా 2014లో టీడీపీని ఖాళీ చేయించింది. 2018లో కాంగ్రెస్ను ఖాళీ చేయించాలనే లక్ష్యంతో గులాబీ బాస్ పార్టీ గేట్లు తెరిచారు. ఎమ్మెల్యేలు, నేతలను పార్టీలో చేర్చుకు న్నారు. దాదాపు ప్రతిపక్షం అనే పదం లేకుండా చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ వేసిన పాచికలనే ప్రయోగించి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివేంజ్ తీసుకుంటున్నారు. గులాబీ పార్టీని ఖాళీ చేసే వ్యూహాలకు పదునుపెట్టాడు. లోక్ సభ ఎన్నికలకు ముందు హస్తం పార్టీ గేట్లు తెరిచాడు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కట్టారు.
ఈ మధ్యనే.. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకు న్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ పి రాములు కూడా గులాబీ దండును విడిచి పెట్టారు. అంతకు ముందే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పార్టీ మారారు. ఇలా దెబ్బమీద దెబ్బ తగులుతూ వచ్చింది. తాజాగా పార్టీకి కీలకంగా ఉన్న కే కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మీ బీఆర్ఎస్ను వీడుతున్నట్లు ప్రకటించడం కేసీఆర్కు మింగుడుపడటం లేదు. ఇక మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా పార్టీని వీడుతుండడం సంకటంగా మారింది.
బీఆర్ఎస్ చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్రెడ్డి కాంగ్రెస్లోకి చేరి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్సభ బరిలో నిలిచారు. వికారా బాద్ జడ్పీ ఛైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరగా.. ఆమెకు మల్కాజిగిరి టికెట్ లభిం చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారపార్టీలో చేరి, సికింద్రాబాద్ లోక్సభ టికెట్ దక్కించు కున్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీపాటిల్ బీజేపీలో చేరిన వెంటనే ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ పి.రాములు బీజేపీలో చేరగా.. ఆయన కుమారుడికి టికెట్ లభించింది. మాజీ ఎంపీలు జి.నగేశ్, అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సైదిరెడ్డిలు ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకొన్నారు. వరం గల్ ఎంపీ పసునూరి దయాకర్ హస్తం గూటికి చేరారు. వరంగల్ నుంచి టికెట్ను ఆశించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ సైతం కారు దిగి కమలం పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరమయ్యాయి. పార్టీని వీడుతున్న నాయకులు కవిత అరెస్ట్, నీటి పాజెక్టులలో లోపాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను ప్రస్తావించి లేఖలు రాయడం, పార్టీని దుమ్మెత్తి పోయడం కేసీఆర్ కు మరింత సంకటంగా మారింది. ఉన్న నాయకులు వలసపోకుండా చూసుకోవడమే గులాబీ బాస్కు అశిధారా వ్రతమే.


