ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఈసారి నాయకులపై వ్యక్తిగత దూషణలు హద్దుమీరుతు న్నాయి. ఆంధ్రప్రదేశ్లో జనసేన ఒక ప్రతిపక్షంగా ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామ్యపక్షంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల పై నిర్మాణాత్మక విమర్శలు చేసే హక్కు ఒక ప్రతిపక్ష పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్కు ఉంది.ఇందులో రెండో ముచ్చటే లేదు. అయితే పవన్ కల్యాణ్ విమర్శలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వవచ్చు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విధానాలను సమర్థించుకోవచ్చు. అయితే ఇక్కడో చిక్కు వస్తుంది. పవన్ కల్యాణ్ను విమర్శించే సమయంలో ఆయనపై వ్యక్తిగత దూషణలు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. పవన్ కల్యాణ్ మూడు వివాహాలు చేసుకున్నారంటూ తమ విమర్శలకు మసాలా జోడించడం ఇటీవల బాగా కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ ఎన్ని వివాహాలు చేసుకున్నాడనేది ఆయనకు సంబంధించిన వ్యవహారం. ఒక్కమాటలో చెప్పాలంటూ పూర్తిగా పవన్ కల్యాణ్ స్వంత గొడవ. చేసుకున్న వివాహాలన్నీ చట్టబద్దమైనవే. పవన్ కల్యాణ్ తమకు అన్యాయం చేశారంటూనో లేదా తమను వేధించారనో ఆయన మాజీ భార్యలెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మీడియా సాక్షిగా మాట్లాడలేదు. అటువంటప్పుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన వివాహాల సంగతిని రాజకీయ ప్రత్యర్థులు తరచూ ప్రస్తావించడం ఎంత వరకు సమంజసమని సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కూడా రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. స్వంత చెల్లినే చూడని వాడు .రాష్ట్రాన్ని ఏం బాగు చేయగలడంటూ ఇటీవలి కాలంలో కూటమి నాయకులు విమర్శలకు పదును పెట్టారు.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి చేయాల్సిన కృషి జగన్మోహన్ రెడ్డి చేయలేదని ప్రతిపక్షాలు ప్రచారం చేయవచ్చు. అభివృద్దిపై జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదని కూడా విమర్శలు చేయవచ్చు. ప్రభుత్వ సొమ్మును పూర్తిగా సంక్షేమానికి ఖర్చు పెట్టి అభివృద్ది అంశాన్ని జగన్మోహన్ రెడ్డి అటక ఎక్కించారని కూడా ఘాటు విమర్శలు చేయవచ్చు. అయితే రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేయడంలో ఇంత పరిణతి చూపించడం లేదు. అవకాశం దొరికింది కదా. అని నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా ఆరోపణ లు, విమర్శలు చేయడంలో రికార్డులు సృష్టిస్తున్నారు.
వ్యక్తిగత విమర్శలు చేసే నాయకుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా చేరారు. దీనికి నిదర్శనం. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఎపిసోడ్ పై నరేంద్ర మోడీ ప్రతిస్పందించిన తీరే. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని చెబుతూ దక్షిణాదివారు ఆఫ్రికన్లలాగా కనిపిస్తారని శామ్ పిట్రోడా యధాలాపంగా ఓ కామెంట్ చేశారు. దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటారని మాత్రమే శామ్ పిట్రోడా అనలేదు. దేశంలోని తూర్పు ప్రాంతాలవారు చైనీయుల వలె, పశ్చిమ ప్రాంతాలవారు అరబ్బుల వారిలా, ఉత్తరాది వారు శ్వేతజాతి వారిలా ఉంటారని కూడా అన్నారు. ఈ పోలికలలో మిగతా వాటిని వదలివేసి, కేవలం దక్షిణ భారతీయలు ఆఫ్రికన్లలా ఉంటారన్న ఒక మాటను కమలం పార్టీ నాయకులు వివాదం చేశారు. దీంతో దక్షిణాదివారిని ఆఫ్రికన్లతో పోలుస్తారా? అంటూ భారతీయ జనతా పార్టీ మండిపడింది. శామ్ పిట్రోడా వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ప్రధాని మోడీ డిమాండ్ చేశారు.
కథ అక్కడితో ఆగలేదు. శామ్ పిట్రోడా వ్యాఖ్యల ఎపిసోడ్తో ఎటువంటి సంబంధం లేని ద్రౌపది ముర్మను కూడా వివాదంలోకి లాగారు. ద్రౌపది ముర్ము నల్లగా ఉంటారు కాబట్టే రాష్ట్రపతి అభ్యర్థినిగా ఆమెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదని సంచలన ఆరోపణ చేశారు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో రాజకీయ లబ్ది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శరీరరంగును కూడా వివాదంలోకి లాగారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇదిలా ఉంటే బీజేపీకి చెందిన తరుణ్ విజయ్ గతంలో దక్షిణాదివారి గురించి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ వారు మరచిపోయారు. ఒక దశలో ఉత్తరాదివారమైన తాము. దక్షిణాదివారితో కలసి ఉంటున్నామంటూ తరుణ్ విజయ్ వ్యాఖ్యానించారు. నల్లగా ఉండే దక్షిణాది వారితో తెల్లరంగులో ఉండే ఉత్తరాదివారు ఎంతో ఉదార స్వభావంతో కలిసి జీవిస్తున్నారని తరున్ విజయ్ పేర్కొన్నారు. అయితే దక్షిణాదివారిని చిన్నచూపు చూస్తూ తరుణ్ విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇప్పుడు బీజేపీ నాయకులు ఎవరూ ప్రస్తావించడం లేదు. ఏమైనా ప్రస్తుత ఎన్నికల సమయంలో అసలు సమస్యలను వదిలేసి భావోద్వేగాలను రెచ్చగొట్టే విద్వేష ప్రసంగాలకే నాయకులు పాల్పడుతున్నారు.


