డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా మార్చి 6న దిల్లీలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలని, మార్చి 10న దేశవ్యాప్తంగా రైల్ రోకో చేపట్టాలని పిలుపుని చ్చాయి. ప్రస్తుతం శంభు, ఖానౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద జరుగుతున్న ఆందోళనకు పంజాబ్, హరియాణా రైతులు మద్దతు కొనసాగిస్తుండగా.. మార్చి 6న ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు కూలీలు రాజధాని దిల్లీకి చేరుకొని నిరసనలో పాల్గొనాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ట్రాక్టర్ ట్రాలీల్లో చేరుకోలేని దూర రాష్ట్రాల రైతులు రైళ్లు, ఇతర రవాణా మార్గాల ద్వారా దిల్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. శంభు, ఖానౌరి వద్ద ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. ఈ ఆందోళనను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు మార్చి 10వ తేదీన రైల్రోకో చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.. రైతుల డిమాండ్లకు మద్దతుగా అన్ని పంజాబ్ పంచాయతీలు తీర్మానం చేయాలని, ప్రతి గ్రామం నుంచి ఒక ట్రాక్టర్ ట్రాలీ సరిహద్దు పాయింట్ల వద్దకు చేరుకుంటుందని తెలిపారు. దిల్లీ చలో మార్చ్ను అడ్డుకొనేందుకు కేంద్రం అన్ని వ్యూహాలు పన్నిందని తెలిపారు.