ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటున్నారు అభ్యర్థులు. పార్లమెంట్ బరిలో దిగిన రేసు గుర్రాలకు కలిసొచ్చే అంశాలు ఎలా ఉన్నా, వ్యతిరేక పవనాలు కలవరపెడుతున్నాయి. దీంతో హైక మాండ్ ఎప్పటికప్పుడు గెలుపే లక్ష్యంగా ఆదేశాలు జారీ చేస్తోంది. అందరిని సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని, విమర్శలకు తావీయకుండా నడుచుకోవాలని హెచ్చరిస్తోంది. దీంతో అసంతృ ప్తులను తమవైపుకి తిప్పుకోవడం అభ్యర్థులకు ఓ సవాల్గానే మారింది.
ఆదిలాబాద్లో ఎన్నికల వేడి సమ్మర్ను మించి సెగలు కక్కుతోంది. ఎంపీ సీటు దక్కించుకోవడం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారడంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోటీతో త్రిముఖ పోరు నెలకొంది. ఇక ఈ క్రమంలో అభ్యర్థుల బలాబలాలు, వ్యూహా, ప్రతివ్యూహాలపై అధిష్టా నానాలు దృష్టి సారించాయి. అయితే, సొంత పార్టీల్లోని ముఖ్య నేతల ద్వంద్వ వైఖరి కలవరపెడుతుం డగా.. మరోపక్క అంకితభావంతో పనిచేసే కింది స్థాయి కార్యకర్తల పనితీరు ఊరటనిస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య తమ అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తూ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నాయి పార్టీల హైకమాండ్లు.
ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ పార్లమెంటరీ ఎన్నికల పోరులో నిలవడం ఇదే తొలిసారి. అయితే, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అండదండలు, హైకమాండ్ సానుకూలతతో అభ్యర్థిగా రాణించగలిగినప్పటికీ, టికెట్ చేజారి నిరాశలో ఉన్న అసంతృప్తులను దారికి తెచ్చుకోవటం పరీక్షగా మారింది. టికెట్ కోసం 22 మంది దరఖాస్తు చేసుకోగా, కొందరు తమ పరిధిలోని ఓటర్లను ప్రభావింత చేయగలిగే రాజకీయ పరిణితి ఉన్నారు. ఈ ఎఫెక్ట్ సుగుణ గెలుపుపై పడే అవకాశం ఉంది. దీంతో వారందర్నీ ఏకతాటిపై నడిపించటంలో సుగుణ ఏ మేరకు సఫలీకృతమవుతారనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మహిళా అభ్యర్థి కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండ టం, ఇటీవల బీఆర్ఎస్ ముఖ్య నేతలు హస్తం కండువా కప్పుకోవడం అందర్నీ సమన్వయం చేసే బాధ్యతను మంత్రి సీతక్క తీసుకోవటం సుగుణకు కలిసి వచ్చే అంశాలు.
ఇక బీజేపీ టికెట్ గోడం నగేష్ని వరించటమే ఓ అనూహ్య మలుపు. ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా పేరున్నప్పటికీ సంస్థాగత ఆచరణలతో నడిచే బీజేపీ సిద్ధాంతాలకు కొత్త కావటం కొంత ఇబ్బందికరమైన అంశమే. ప్రధాని మోదీ చరిస్మా, హిందుత్వ నినాదం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అండదండలు ఉండటం నగేష్కు కలిసివచ్చే అంశాలు. కానీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేదే ప్రస్తుతం అటు అధిష్టానాన్ని, ఇటు అభ్యర్థి నగేష్ను కలవరపెడుతోంది. పార్టీలోని క్రియాశీలకమైన నాయకుల సమన్వయంతో కాకుండా ఒకరిద్దరు అనుకూలమైన అనుచరులతోనే నగేష్ అంతర్గత ప్రచారం చేస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పార్టీకి దూరంగా ఉండటం, టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంటీముట్టనట్లు వ్యవహరించటం అధిష్టానం దృష్టికి వెళ్లింది. అయితే, హైకమాండ్ సూచనతో సోయం బాపురావు, రమేష్ రాథోడ్ను సమన్వయం చేసుకునేందుకు నగేష్ ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యంకావడం లేదని తెలుస్తోంది. దీంతో నగేష్ కాస్త కంగారులో ఉన్నారన్నటాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ టికెట్ను ఏకపక్షంగా దక్కించుకోవడంలో విజయం సాధించిన ఆత్రం సక్కు పార్టీలో నెలకొన్న అనిశ్చితిని ఛేదించాల్సిఉంది. ఆదిలాబాద్లో జోగు రామన్న, ఆసిఫాబాద్లో కోవ లక్ష్మీ, బోథ్ నియోజకవర్గంలో అనిల్ జాదవ్ బలంగానే ఉన్నప్పటికీ మిగిలిన నిర్మల్, ముధోల్, సిర్పూర్(టి), ఖానాపూర్ నియోజకవర్గాల్లో శ్రేణులను ఏకతాటిపై నడిపించగలిగే నేతల కోసం అన్వేషించాల్సి వస్తోంది. ఇలా ఆదిలాబాద్లో పార్లమెంట్ రేసు గుర్రాలకు కలిసొచ్చే అంశాలు ఉన్నప్పటికీ, అసంతృప్తులను కలుపుకుని ముందుకు సాగడం, హైకమాండ్ ఆదేశిస్తున్నట్టు అందరి మనసును గెలుచుకుని విక్టరీని కొట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో ఓ పెద్ద పరీక్షగానే మారిందని చెప్పాలి.