ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 98.47 మంది పింఛన్ లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. 48 లక్షల 92 వేల 503 మందిలో 48 లక్షల 17 వేల 718 మంది డబ్బులు ఖాతాల్లో జమ చేశారు. బ్యాంకు అకౌంట్లు పనిచేయని కారణంగా కొందరికి పింఛను డబ్బులు జమకాలేదు. వారందరికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 74 వేల 399 మంది పింఛనుదారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని లెక్క తేల్చారు. సచివాలయ ఉద్యోగులు వీరందరికీ ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలి పారు. వీరి జాబితాను ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటు లో ఉంచుతామని చెప్పారు. మొత్తంగా చూస్తే.. 65.49 లక్షల మందికి గాను 63.31 లక్షల మంది లబ్ధిదారులకు అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ తెలిపారు. 15 లక్షల 13 వేల 752 మందికి ఇంటింటికీ వెళ్లి పింఛన్ అంద జేశారు అధికారులు. ప్రధానంగా దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చారు.
మరోవైపు పింఛన్ల విషయంలో కొంత గందరగోళం కనిపించింది. పింఛన్లు అకౌంట్కు జమ చేశారని చెప్పడంతో అందరూ బ్యాంకులకు క్యూ కట్టారు. దీంతో అక్కడ రద్దీ పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లు కనిపించాయి. ఓ వైపు ఎండలు, వేడిగాలులతో జనాలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని చెప్పినా, చాలా మందికి జమ కాకపోవడంతో ఆందోళన చెందారు. బ్యాంకులకు వెళితే అక్కడ భారీగా క్యూ లైన్లు కనిపించాయి. కష్టమో నష్టమోనని కొందరు లబ్ధిదారులు క్యూ లైన్లలో గంటలకొద్ది నిలబడి అకౌంట్ చెక్ చేయిస్తే, డబ్బులు జమ కాలేదని తెలిసి నిరాశతో వెనక్కు వెళ్లిపోయారు.


