ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. అలాంటి ఓటే మన తలరాతలే కాదు.భవిష్యత్ తరాలకు బంగారు బాట వేయగలదు. అందుకే సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. అంతేకాదు, ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతూ భారీ భద్రత ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు.
ఎంపీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఈనెల 9, 10 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పిస్తున్నామని GHMC కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 45 శాతం ఓటింగ్ జరిగిందని, ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 16వేలకు పైగా ఉంటే 9వేలకు పైగా ఓట్ల పోలింగ్ పూర్తి అయిందన్నారు. హోం ఓటింగ్కి సంబంధించి 571 మందికి గాను 532 ఓట్లు పోల్ అయ్యాయని చెప్పారు. వికలాంగుల కోసం సాక్ష్యం యాప్ అందుబాటులో ఉందని, రిజిస్టర్ చేసుకుంటే పోలింగ్ రోజు ఓటు వెయ్యడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని రొనాల్డ్ రాస్ తెలిపారు.
పోలింగ్కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ వ్యాప్తంగా 383 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, లా అండ్ ఆర్డర్ అంశంలో ఉన్నాయని, మొత్తం1046 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద రెండంచల బందోబస్తు పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఎలాంటి వ్యక్తులకు అనుమతి లేదన్నారు. ఇక 14వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటున్నారని, ఇప్పటి వరకు 38 కోట్ల నగదు సీజ్ చేసామన్నారు. గత ఎంపి ఎన్నికల్లో 26 కోట్లు మాత్రమే సీజ్ జరిగిందన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర బలగాలు ఇప్పటికే 12 కంపెనీలు ఇప్పటికీ రాగ మరో 9 కంపెనీలు బలగాలు వస్తాయన్నారు. మొత్తానికి తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ వైపు నిలబడతారో చూడాలి.


