స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోవడానికే ఆంక్షలు విధించామని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు అమలాపురం ఎస్పీ.సెక్షన్ 30 యాక్ట్ సాధారణ విధుల్లో భాగమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేకించి జనసేన సభల కోసం పెట్టింది కాదని స్పష్టం చేశారు. ఆ తర్వాత.. పవన్ కల్యాణ్ సభ జరిగే ప్రాంతాన్ని..జనసేన నేతలతో కలిసి పరిశీలించారు అమలాపురం డిఎస్పీ.. వారాహియాత్ర రూట్మ్యాప్ను కూడా పరిశీలించారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా అమలాపురంలో పోలీసులు ఆంక్షలు పెట్టారన్న వివాదం సద్దు మణిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం నుంచి నెలాఖరు వరకు సెక్షన్ 30 యాక్ట్ అమలులోకి వచ్చింది. దీంతో వారాహి యాత్రను అడ్డుకునేందుకే పోలీసులు ఆంక్షలు పెట్టారని జనసేన కార్యకర్తలు ఆందోళన చెందారు. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. వారాహి యాత్ర కోసం ఆంక్షలు పెట్టలేదని.. అవన్నీ సాధారణ విధుల్లో భాగమేనని అమలాపురం ఎస్పీ చెప్పారు.
మరోవైపు, వారాహి యాత్ర కోసం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఏపీ చేరుకున్నారు. ఇవాళ మంగళగిరి ఆఫీసుకి వెళ్లి.. రేపటి హోమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తారని తెలిసింది. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్.. ఏం మాట్లాడతారు? ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేస్తారన్నది పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ లో భాగంగా నిర్వహించే బహిరంగ సభల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 14నుంచి పవన్ యాత్ర ప్రారంభం కానుండగా.. 14న కత్తిపూడిలో, 16న పిఠాపురంలో, 18న కాకినాడలో, 20న ముమ్మడివరంలో, 21న అమలాపురంలో, 22న పి. గన్నవరంలో , 23న నరసాపురంలో పవన్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో జనసేన నేతలు పోస్టర్లు కూడా ఆవిష్కరించారు. ముందుగా మంగళగిరిలో పార్టీ ఆఫీసులో కార్యకర్తలతో యాత్రకు సంబంధించి సమావేశం నిర్వహించారు.