భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. అర్ధరాత్రి నుంచి భారతీయ న్యాయ సంహిత , భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ చట్టాలు అమల్లోకి వచ్చా యి. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత కింద తొలి కేసు నమోదైంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ పరిధిలోని ఓ వీధి వ్యాపారిపై కొత్త క్రిమినల్ కోడ్లోని సెక్షన్ 285 కింద పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దేశ రాజధానిలో ఒక వీధి వ్యాపారి రోడ్డుపై వాటర్ బాటిళ్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. ఆయన తాత్కాలిక దుకాణం NDRS సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద ఉంది. దానివల్ల రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దాంతో దానిని వేరేచోటుకు తరలించమని ఆయని పోలీసులు పలుమార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దానివల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను వీడియో తీసి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు FIR నమోదు చేశారు. ఆ వీధి వ్యాపారిని బిహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.ఈ కొత్త చట్టాల ప్రకారం.. క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవశిక్ష పడనుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం, చిన్నారులపై సామూహిక అత్యాచారం, మూకదాడి తదితర నేరాలకు ఇంతకుముందు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు. దీంతో గందరగోళం ఏర్పడేది. భారతీయ న్యాయ సంహితలో ఆ లోటును పూడ్చారు.


