స్వతంత్ర వెబ్ డెస్క్: ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త రూట్ లోకి వచ్చింది. సీటు ఆశించే వారు..ఫీజు కట్టి దరఖాస్తులు పెట్టుకోవాలని రూల్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను టీపీసీసీ స్వీకరించనుంది. నేడు గాంధీభవన్లో అభ్యర్థుల అప్లికేషన్ ఫామ్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విడుదల చేశారు. ఇక అసెంబ్లీ సీటు ఆశించే వారు డబ్బు కట్టి దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక ఎస్సీ, ఎస్టీ ధరఖాస్తుదారులకు రూ.25 వేలు, బీసీ, ఓసీలకు 50 వేల రూపాయల ధరఖాస్తు రుసుముగా ఖరారు చేశారు.
ఇక ఇక్కడ రేవంత్ కొత్త మెలిక పెట్టారు. సీటు దక్కితే ఇబ్బంది లేదు..సీటు దక్కని వారికి మళ్ళీ దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదని.. దరఖాస్తు రుసుము పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పారు. ఇక ఈ నెల 25 తర్వాత దరఖాస్తులను స్క్రూటీని చేస్తామని, ప్రతీ దరఖాస్తుదారుడి బలాలు, బలహీనతలపై సర్వేలు నిర్వహిస్తామని, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాలను అంచనా వేసి స్క్రీనింగ్ కమిటీకి నివేదిక ఇస్తామని చెప్పారు.
ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ…బలమైన అభ్యర్ధులని ఇద్దరు లేదా ముగ్గురిని ఫిక్స్ చేసి..చివరిగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. అప్పుడు సెంట్రల్ కమిటీ ఫైనల్ గా అభ్యర్ధులని విడుదల చేస్తుందట. అయితే 25 తర్వాత ఎవరైనా పార్టీలో చేరి టిక్కెట్ అడిగితే పీఏసీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇలా కాంగ్రెస్ లో కొత్త ఫార్ములాకు తెరలేపారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.