స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్లో(Hyderabad) అడుక్కునేవాళ్లకు ఓ ప్రబుద్ధుడు జీతం ఇస్తున్నాడు. అడుక్కుకోవడం కూడా ఒక పనిగా భావించి దాన్ని బిజినెస్ కింద మార్చుకున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 23 మందిని ‘ఉద్యోగం’లోకి తీసుకున్నాడు. వారికి మాంచి డిమాండ్ ఉన్న ఆయా కూడళ్లలో ‘పోస్టింగ్’ ఇచ్చి దందా నడిపిస్తున్నారు. పొద్దున పని అప్పగించడం సాయంత్రం వారు వసూలు చేసిన సొమ్మును లాక్కుని ‘జీతం’ ఇవ్వడం అతని బిజినెస్. రోజుకు రూ. 200 కూలి కింద కుంటాళ్లను, దిక్కుమొక్కులేని వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకున్నాడు. విషయం పోలీసులకు తెలియడంతో జైల్లోకి నెట్టారు.
బిహార్కు చెందిన అనిల్ పవార్ అనే యువకుడు భాగ్యనగరంలో బెగ్గింగ్(Beggind Rocket) రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కేబీఆర్ పార్క్, జూబ్లీ హిల్స్(Jubli Hills) చెక్ పోస్ట్ కూడళ్లలో అతడు జీతానికి భిక్షాటన చేయిస్తున్నట్లు తేలడంతో గురువారం అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద నియమితులైన బిచ్చగాళ్ల నుంచి అనిల్ రోజూ సగటున 6 వేలు వసూలు చేస్తూ వారికి రూ. 200 కూలి ఇస్తున్నట్లు తేలింది. భిక్షాటన నిరోధక చట్టం కింద అతనిపై కేసు పెట్టారు.