Karnataka Congress |కర్ణాటకలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కమలం పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తుంటే.. ఎలాగైనా కర్ణాటకలో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడం.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే కర్ణాటకలో గెలుపు తప్పరిసరనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నోటిఫికేషన్ వెలువడక ముందే.. ప్రధాన రాజకీయపార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీకి షాకివ్వాలని జేడీఎస్ ప్రణాళికలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Karnataka Congress |కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్లు ఉన్నాయి. మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా, శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. కర్ణాటక శాసనసభలో్ మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. దీంతో గడువుకన్నా ముందే ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలను చేస్తోంది. దీంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు కైవసం చేసుకున్నాయి. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు దక్కించుకోగా.. ఒక ఇండిపెండెంట్ సైతం గొలుపొందిన విషయం తెలిసిందే.