Balakrishna | నాన్న గారి శతజయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయని, ఆయన ప్రభావం ప్రాభవం ఇప్పటికీ తెలుగు జాతికి స్ఫూర్తినిస్తుందనటానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు నందమూరి బాలకృష్ణ. ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకల కమిటీ, చైర్మన్ టి.డి. జనార్థన్ సారధ్యంలో నందమూరి బాలకృష్ణతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చేస్తున్న కృషిని బాలకృష్ణకు జనార్దన్ వివరించారు. తన తండ్రే తనకు స్ఫూర్తి ప్రదాతని, ఆయన మార్గంలోనే తాను ప్రయాణిస్తున్నానని బాలకృష్ణ తెలిపారు.
ఎన్.టి.ఆర్. శతజయంతి సంవత్సరంలో ఆయన తరతరాలకు గుర్తిండిపోయేలా తమ కమిటీ గత ఆరు నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు. ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలను విజయవాడ, హైదరాబాద్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జయహో ఎన్.టి.ఆర్. పేరుతో ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో రామారావు గారికి సంబంధించిన వ్యాసాలు /వీడియోలు ఉంటాయని, అలాగే రామారావు గారు ముఖ్యమంత్రి గా అసెంబ్లీ లో చేసిన ప్రసంగాలు, బయట చేసిన ప్రసంగాలను రెండు పుస్తకాలుగా తీసుకోస్తున్నామని తెలిపారు.’శకపురుషుడు’ పేరుతో ఒక ప్రత్యేక సంచిక రూపకల్పన చేస్తున్నామని, ఇందులో రామారావు గారి సినిమా, రాజకీయ జీవితంపై పై విశ్లేషణాత్మకమైన వ్యాసాలు, అపురూపం ,అరుదైన ఫోటోలు వుంటాయని జనార్దన్ తెలిపారు. ఈ మేరకు చైర్మన్ టి.డి.జనార్దన్, మిగతా కమిటీ సభ్యులను బాలకృష్ణ(Balakrishna) అభినందించారు. ఈసమావేశంలో చైర్మన్ టి.డి. జనార్థన్ సభ్యులు, కాట్రగడ్డ ప్రసాద్, భగీరథ, విక్రమ్ పూల, అట్లూరి నారాయణరావు తదితరులు బాలకృష్ణను కలసి తమ కృషిని వివరించారు.