వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలిమినే షన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 26 మంది ఎలిమినేట్ అయ్యారు. 27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఎలిమినేషన్ రౌండ్స్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 220 ఓట్లు రాగా, బీఆర్ ఎస్కు 139 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 118, స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 76 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు, ప్రతిపక్ష BRSకు చెందిన ఏనుగుల రాకేశ్రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు కోటా ఓట్లను లక్షా 55 వేల 95గా నిర్ణయించారు. దీంతో మల్లన్న గెలవాలంటే 32వేల 282 రెండో ప్రాధాన్యత ఓట్లు కావాల్సి ఉండగా, రాకేశ్ రెడ్డి గెలుపునకు 50 వేల 847 ఓట్లు రావాల్సి ఉంది. ఈసారి 25 వేల 824 ఓట్లను చెల్లనవిగా అధికారులు గుర్తించారు.
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వాస్తవ లెక్కలకు, నమోదు చేస్తున్న లెక్కలకు సరిపోలడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నది. కౌంటింగ్టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపునకు, ఆర్వో ప్రకటిస్తున్న ఓట్లకు తేడా ఉంటున్నదని, దానిని సరిచేయాలని ఈసీని కోరింది. ఈమేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి గురువారం రాత్రి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొదటి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థికి ప్రయోజనం కలిగే విధంగా కౌంటింగ్ అధికారులు లెక్కలు వేస్తున్నారని ఆరోపించారు.


