స్వతంత్ర, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో బడిబాట కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరైయ్యారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా మొదటి రోజున హాజరైన విద్యార్థులకు స్వాగతం పలికి అభినందించారు. నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు పలకలు పంపిణీ చేసి అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందివ్వాలని తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. నోటు పుస్తకాలకు రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.
గత సంవత్సరం పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం 132 కోట్లు ఖర్చు చేయగా ఈ విద్యా సంవత్సరానికి గాను 200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. దాదాపు 150 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్ ను ఈ నెల 20 న జరిగే విద్యా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు. రూపాయలు 35 కోట్లతో ఉదయం పూట విద్యార్థులకు రాగి జావా అందిస్తున్నట్లు తెలిపారు..పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లకు విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలని సూచించారు.