స్వతంత్ర వెబ్ డెస్క్: రైల్వే ట్రాక్ పనులను పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన హరీష్ రావు.. సిద్దిపేటలో రైలు కూత త్వరగా వినిపించాలంటే ట్రాక్ నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
మనోహరాబాద్-కొట్లపల్లి రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ మొత్తం వ్యయంలో మూడింట ఒక వంతు భరించాలన్న ఒప్పందం మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.500 కోట్లు ఖర్చు చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 2,200 ఎకరాల భూసేకరణ పూర్తయింది. ఇంకా 300 నుంచి 350 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. అందులో మెదక్ జిల్లాలో 171 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 1342 ఎకరాలు, సిరిసిల్ల జిల్లాలో 708 ఎకరాలు భూసేకరణకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించి సేకరించింది. మెదక్ జిల్లా పరికిబండ వద్ద భూసేకరణకు అటవీ అనుమతుల సమస్య ఉంటే అందుకు అవసరమైన నిధులు వెచ్చించి క్లియర్ చేశామన్నారు. మనోహరాబాద్ వద్ద జాతీయ రహదారి ఆర్వోబీ నిర్మాణానికి ఇబ్బంది ఉంటే ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీలో పనులు పూర్తి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రైల్వేకు మరో రూ.100 కోట్లు మంజూరు చేస్తామన్నారు.
రైల్వే శాఖ పనులు వేగవంతం చేసి పగలు, రాత్రి పనులు నిర్వహించి త్వరగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ రైలు మార్గం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు మార్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ రైలు మార్గంలో గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. భవిష్యత్తులో, ఈ లైన్ నార్త్, సౌత్ యొక్క ముఖ్యమైన రైల్వే మార్గంగా అభివృద్ధి చెందుతుంది. దాదాపు 75 కి.మీ దూరం తగ్గుతుందని తెలిపారు. రైల్వేలైన్ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా యంత్రాంగం సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.