తెలంగాణ రా ష్ట్ర ద్రవ్యలోటు భారీగా పెరిగింది. 2022-23లో 32వేల119 కోట్లు ఉన్న ద్రవ్యలోటు 2023-24లో 49 వేల 440.92 కోట్లకు చేరింది.ఏడాది వ్యవధిలో 17వేల321.92 కోట్లు పెరిగింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలున్నందున అప్పటి ప్రభుత్వం నవంబరు నాటికే భారీగా అప్పులు సేకరించడంతో ద్రవ్యలోటు బాగా విస్తరించింది. గతేడాది బడ్జెట్లో అప్పుల అంచనా 38వేల234.94 కోట్లకు అదనంగా మరో 11 వేల కోట్లను ప్రభుత్వం సేకరించింది. మొత్తం అప్పులు 49 వేల కోట్లు దాటాయి. బడ్జెట్లో పేర్కొన్న రుణ సేకరణ లక్ష్యం కన్నా 29 శాతం అదనంగా తీసుకోవడం గమనార్హం. అప్పులతో కలిపి రాష్ట్ర ఆదాయాన్ని బడ్జెట్లో లక్ష్యంగా ప్రభుత్వం చూపడం ఆనవాయితీ. గతేడాది ఇలా మొత్తం 2.59 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని లక్ష్యంగా పెట్టుకోగా 2.18 లక్షల కోట్లే వచ్చింది.
వ్యయ లక్ష్యం 2.49 లక్షల కోట్లు కాగా ఖర్చుపెట్టింది 2.11 లక్షల కోట్లు. ఆదాయం అంచనా కన్నా 41 వేల కోట్లు తగ్గగా వ్యయం 38 వేల కోట్లు తగ్గింది. మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆదాయ, వ్యయాలు, సేకరించిన కాగ్ అప్పులు, జీతభత్యాలు, పింఛన్లు తదితర లెక్కలపై తాజాగా కేంద్రానికి నివేదికను సమర్పించింది. రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీ, మద్యంపై సుంకం, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, వ్యాట్ కింద వచ్చేవి కీలకం. జీఎస్టీ కింద 50వేల942.66 కోట్లు వస్తాయని అంచనా వేయగా 46వేల500.43 కోట్లు వచ్చాయి. గత నవంబరులో అసెంబ్లీకి ఎన్నికలు జరగడం. తదుపరి లోక్సభ ఎన్నికల హడావిడితో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయం 32 శాతానికి పైగా తగ్గింది. ఈ పద్దు కింద 18 వేల 500 కోట్లు అంచనా వేస్తే 14వేల295.56 కోట్లు వచ్చాయి.
పెట్రోలు, డీజిల్, మద్యంపై వసూలు చేసే అమ్మకపు పన్ను పద్దు కింద 39వేల500 కోట్ల అంచనాకు గాను 24.08 శాతం తగ్గి 29వేల989.55 కోట్లే వచ్చాయి. మద్యంపై విడిగా వసూలు చేసే ఎక్సైజ్ సుంకం ఎక్కువగా వచ్చింది. 19వేల884.90 కోట్లకు 20వేల298.89 కోట్లు వసూలయ్యాయి. భూముల అమ్మకాలు, ఔటర్ రింగు రోడ్ టెండర్లు వంటివాటిపై భారీగా నిధులు సమకూరడంతో పన్నేతర ఆదాయం పద్దు కింద 22 వేల 808 కోట్ల లక్ష్యానికి 23వేల 819.50 కోట్లు వచ్చాయి. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ 41వేల259.17 కోట్లకు గాను 76 శాతానికి పైగా తగ్గి 9వేల729.91 కోట్లే రావడం వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాంతో బడ్జెట్ ఆదాయ, వ్యయాల అంచనాలు పట్టాలు తప్పాయి. ద్రవ్యలోటు పెరిగి అంచనాకన్నా 29 శాతం అదనంగా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్ప డింది.
ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లకు వెచ్చించాల్సింది 51వేల651 కోట్లు అనుకుంటే, ఆ మొత్తం 55వేల752 కోట్లకు చేరింది. పింఛన్ల భారం లక్ష్యానికన్నా 29% అదనంగాపెరిగింది. సంక్షేమ పథకాలకు చెల్లించే రాయితీ నిధుల పద్దు లక్ష్యం 12,958.70 కోట్లు కాగా 27.38% తగ్గించి 9వేల410.51 కోట్లే ఇచ్చారు.గతంలో ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీలు, కిస్తీల కింద 22వేల407.67 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని భావించగా 23వేల337.40 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. నెలవారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ఆదాయం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2023 నవంబరులో 9వేల701 కోట్లు రాగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో 13వేల703.92 కోట్లు వచ్చాయి.


