అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను లోక్సభ ఎలక్షన్లలోనూ పునరావృతం చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని యోచిస్తున్న హస్తం అధినేతలు.. ఆపరేషన్ ఆకర్ష్ను ప్రారంభించారు. ఇంకేముంది.. మొన్నటి వరకు గులాబీ పార్టీలోనే ఉంటామని చెప్పుకొచ్చిన ప్రతిపక్ష పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు.. ఇలా ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా అధికార కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. దీంతో.. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న హస్తం నేతలు.. మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించి ఢిల్లీ పీఠంపై తమ యువరాజు రాహుల్ను కూర్చోబెట్టడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయా అంటే అవుననే వాదన విన్పిస్తోంది. ఇప్పటికే కేంద్రంలో వరుసగా రెండుసార్లు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది హస్తం పార్టీ. ఓవైపు మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని కమలనాథులు ఉరకలేస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయాలని భావిస్తోంది హస్తం హైకమాండ్. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఇతర జాతీయ పార్టీలతో కలిసి కట్టుగా ముందుకు వెళ్లి ఎన్డీఏకు చెక్ చెప్పాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, హస్తం పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో మెజార్టీ లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు.
సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని ఊపును తీసుకొచ్చాయి. గతేడాది చివర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి పదేళ్ల తర్వాత అధికారాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో చావో రేవో అన్నట్లుగా పోరాడిన హస్తం నేతలు.. గత పదేళ్లుగా సాగుతున్న బీఆర్ఎస్ హవాకు చెక్ పెట్టారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మిత్రపక్షంతో కలిసి 65 సీట్లు సొంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే.. గులాబీ పార్టీ మాత్రం కేవలం 39 స్థానాలకు పరిమితమైంది. అయితే.. మెజార్టీ మార్కుకు కొన్ని స్థానాలు మాత్రమే ఎక్కువగా సాధించడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో కాలం అధికారం చెలాయించే పరిస్థితి ఉండదంటూ విమర్శలు చేయడం ప్రారంభించారు బీఆర్ఎస్ నేతలు. దీంతో.. మొదట్లో పెద్దగా దీనిపై దృష్టి సారించని కాంగ్రెస్ అగ్రనేతలు రానురానూ మనసు మార్చుకున్నట్లే కన్పిస్తోంది. ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల వేళ.. ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ మొదలైందన్న వాదన విన్పిస్తోంది.
ఇందుకు నిదర్శనమా అన్నట్లుగా బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ నేతలు కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కొద్ది రోజుల క్రితమే కారుదిగి హస్తం గూటికి చేరారు. ఇటీవలె భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సైతం సీఎం రేవంత్తో సమావేశం కావడంతో వీరు సైతం పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగు తోంది. నిజానికి రేవంత్ సర్కారు ఏర్పాటైన కొద్ది రోజులకే గూడెం మహిపాల్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. దీంతో… అప్పట్నుంచీ కారు పార్టీ నేతలు హస్తం పార్టీతో టచ్లోకి వెళ్లడం మొదలైందన్న వాదన విన్పిస్తోంది.
ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన లాభం పొంది విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. ఓవైపు పథకా లను అమలు చేయడం మొదలు పెట్టిన రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం.. మరో దిశగా.. వలసల్ని తమకు అనుకూలంగా మలుచుకునే యత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలను చేర్చుకో వడం ద్వారా గులాబీ పార్టీని నైతికంగా దెబ్బతీయడం తోపాటు ప్రతిపక్షాన్ని బలహీనపరచడం ద్వారా లాభ పడొచ్చని వ్యూహాలు రచిస్తోందన్న వాదన విన్పిస్తోంది.
ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికలు కావడంతో అన్ని అంశాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అభ్యర్థుల ప్రకటనపైనా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మహబూబ్నగర్ స్థానం నుంచి వంశీచంద్ రెడ్డికి టికెట్ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మరికొన్ని గంటల్లోనే మిగిలిన పార్లమెంటు స్థానాలకూ అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే.. ఓవైపు కేండిడేట్లను ఖరారు చేసుకుంటూనే ప్రచారంపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడమే కాకుండా… ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు. గులాబీ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను మరింతగా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి.
రాష్ట్రంలో 12 నుంచి 13 ఎంపీ స్థానాలు టార్గెట్గా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా దక్షిణ తెలంగాణపై ఫోకస్ ఎక్కువగా పెట్టారు నేతలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ సహా మరికొన్ని జిల్లాల్లో మొజారిటీ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడంతో ఆయా జిల్లాల్లో ఉన్న ఎంపీ స్థానాలను కచ్చితంగా తమ ఖాతాలో వేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా వ్యూహా త్మకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ను ఖమ్మం ఎంపీ బరిలో దించాలని ప్లాన్ వేస్తున్నారు. రాహుల్ పోటీ చేయడం వల్ల ఆ చుట్టుపక్కన ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మరింతగా పెరుగుతా యని భావిస్తున్నారు హస్తం నేతలు. మరి.. కాంగ్రెస్ వ్యూహాలు, ఆపరేషన్ ఆకర్ష్ ఎంత మేరకు లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి మైలేజ్ తీసుకొస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.