30.5 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

రోజురోజుకూ తగ్గిపోతున్న మహాలక్ష్మి పథకం బస్సులు

మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో ఒక్కసారిగా పెరిగింది. ఆర్టీసీకి లాభాల పంట పండిస్తోంది. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. ఓవైపు ప్రయాణికులు సంఖ్య పెరుగుతుంటే.. బస్సుల సంఖ్య మాత్రం రోజురోజుకూ తగ్గిపోతోంది. దీంతో.. బస్సుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. అంతేకాదు.. సీట్ల కోసం గొడవలు పడాల్సిన దుస్థితి నెలకొంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 2023 డిసెంబర్ 9న ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులతోపాటు హైదరాబాద్ సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ పథకం అమలు చేయడం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికే ప్రయాణించిన మహిళల సంఖ్య వంద కోట్ల మార్కును క్రాస్‌ చేసింది.

ఈ అంకె చాలు మహాలక్ష్మి పథకం ఏ స్థాయిలో విజయవంతమైందో చెప్పడానికి. ఇంతవరకు బాగానే ఉన్నా… మహిళా ప్రయాణికుల ఆదరణ విపరీతంగా ఉన్న బస్సుల సంఖ్య తగ్గిపోవడం ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. రాష్ట్రంలో ఫ్రీబస్ అమల్లోకి వచ్చిన వేళ.. ఆర్టీసీలో 9 వేల 53 బస్సులు ఉంటే.. 2024 జులై వరకు ఉన్న వాటి సంఖ్య 9 వేల 154. అంటే కొద్దిగా బస్సుల సంఖ్య పెరిగింది. కానీ, 2022లో ఉన్న వాటితో పోలిస్తే చాలా తక్కువ. ప్రత్యేకించి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కన్పిస్తోంది. ఇదే సమయంలో డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

2024 మార్చ్‌ వరకు తిరిగే పల్లె వెలుగు బస్సులు 3 వేల 339 ఉంటే.. గతేడాది జులైలో 40కి పైగా పల్లె వెలుగు బస్సుల సంఖ్య తగ్గి 3వేల 292కు పడిపోయాయి. ఇదే టైంలో మూడేళ్ల క్రితం సూపర్ లగ్జరీ బస్సులు, డీలక్స్‌ బస్సుల సంఖ్య 825 ఉంటే ప్రస్తుతం అవి వెయ్యికి చేరుకున్నాయి. దీనిపైనే ఇప్పుడు విమర్శలు విన్పిస్తున్నాయి. నిజానికి అత్యాధునిక సౌకర్యాలు ఉండే డీలక్స్‌, సూపర్ లగ్జరీ బస్సుల సంఖ్య పెరగాలని అందరూ కోరుకుంటారు. కానీ, ఫ్రీ బస్సులను తగ్గించడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సుల్లో పురుషులకు, మహిళలకు చాలా చోట్ల సీట్ల విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పైగా డబ్బులు పెట్టి మరీ నిలబడి పోవడం ఎందుకన్న వాదనను విన్పించే వాళ్లూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓవైపు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతూనే.. బస్సుల సంఖ్యను తగ్గించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించాలని కోరుతున్నారు మహిళా ప్రయాణికులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్