స్వతంత్ర వెబ్ డెస్క్: ఉత్తర కొరియా తాజాగా చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. అమెరికా, ఆ దేశ భాగస్వాముల సైనిక కదలికల పర్యవేక్షణ కోసం నిఘా ఉపగ్రహాన్ని సిద్ధం చేసినట్లు ప్రకటించింది కిమ్ సర్కార్. ఈ ప్రయోగాన్ని జూన్ 11లోపు ఎప్పుడైనా ప్రయోగిస్తామని ముందుగా ప్రకటించిన.. ఆ మరుసటి రోజే రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ఆ ప్రయోగం విఫలమైనట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. రాకెట్ ప్రయాణం అసహజంగా సాగిందని.. శిథిలాలు సముద్రంలో పడిపోయాయని పేర్కొంది. కాగా.. సాధ్యమైనంత త్వరలో మరో నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని ఉత్తర కొరియా పేర్కొంది.
అమెరికా, దాని భాగస్వాముల సైనిక కదలికల పర్యవేక్షణ కోసం నిఘా ఉపగ్రహాన్ని సిద్ధం చేసినట్లు ప్రకటించిన కిమ్ సర్కార్.. ఇప్పటికే ఆ విషయాన్ని జపాన్కు తెలిపింది. కొరియన్ ద్వీపకల్పానికి పశ్చిమాన రెండు ప్రాంతాలు, ఫిలిప్పీన్స్కు తూర్పున ఉన్న మరో ప్రాంతంలో శిథిలాలు పడతాయని జపాన్ కోస్ట్ గార్డ్కు సమాచారం ఇచ్చింది. సైనిక నిఘా తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి తుది సన్నాహాలు చేయాలని కిమ్ ఆదేశించిన మరుసటి రోజే రాకెట్ ప్రయోగం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. మే 31 నుంచి జూన్ 11 మధ్య ఉపగ్రహాన్ని ప్రయోగించే ప్రణాళిక గురించి ఉత్తర కొరియా తమకు తెలియజేసినట్లు జపాన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. అంతలోనే ఉత్తర కొరియా తాజా ప్రయోగం చేసిందని పేర్కొంది. మరోవైపు.. జపాన్ భూభాగంలోకి ఏదైనా ప్రవేశించినట్లయితే కూల్చివేయాలని జపాన్ రక్షణ శాఖ మంత్రి తమ బలగాలను ఆదేశించారు.