Kidney Racket | విశాఖలో కిడ్నీ రాకెట్ దందా ప్రకంపనలు రేపుతోంది. డబ్బు ఆశచూపి అమాయకుల కిడ్నీలను కాజేసి ప్రాణాలను తీసేస్తున్న కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. పెందుర్తి పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి దారుణమైన కిడ్నీ రాకెట్ దందాకు తెరతీసింది. అమాయకులకు ఎరవేసి పేదల అవయవాలను కాజేస్తున్న ఓ ముఠా చేతికి వినయ్ కుమార్ అనే యువకుడు బలయ్యాడు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో మంచానికి పరిమితమయ్యాడు. అయితే.. ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా ఏడుగురు వ్యక్తులు బాధితుల నుంచి కిడ్నీలు తీసేసుకున్నట్లు గుర్తించారు.
బాంబే కాలనీకి చెందిన వినయ్ కుమార్ కి డబ్బు ఆశచూపి కామరాజు, శ్రీను అనే ఇద్దరు కిడ్నీ బ్రోకర్లు.. ఒక కిడ్నీ అమ్మేస్తే రూ.8.50 లక్షలు ఇస్తామని నమ్మబలికారు. ఆపరేషన్ అయ్యాక 2 లక్షలు చేతిలో పెట్టి ఉడాయించారు. ఇటు కిడ్నీ పోగొట్టుకొని ప్రాణాపాయ స్థితిలో బాధితుడు వినయ్ కుమార్ విలవిలలాడుతున్నారు. తాను మోసపోయానికి గ్రహించిన వినయ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి డాక్టర్ పరమేశ్వర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంభందించి తిరుమల ఆస్పత్రిలో విచారణ కొనసాగుతుంది. ప్రాథమిక ఆధారాలు లభించడంతో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ రాకెట్ లో ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.