బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అజీమ్ అనార్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ మహిళ హనీట్రాప్లోకి లాగి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక హత్యకు ఎంపీ పాత స్నేహితుడు 5 కోట్ల సుపారీ ఇచ్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు. వలపు వలలో చిక్కిన అజీమ్ హత్య అనంతరం దారుణంగా చర్మాన్ని ఒలిచి, ముక్కలుగా నరికినట్టు వారు అనుమానిస్తున్నారు.
ఎంపీ అజీమ్ అనార్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సీఐడీ సీసీ ఫుటేజ్ ఆధారంగా కీలక విషయాలను గుర్తించింది. అమెరికాలో నివసించే ఓ మిత్రుడు అద్దెకు తీసుకున్న టౌన్హాల్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లిన ఆయన, ఆ తర్వాత తిరిగిరాలేదని గుర్తించింది. అయితే, ఆ మహిళతో హనీట్రాప్ చేయించి అపార్ట్మెంట్లోకి రప్పించి ఉంటారని అను మానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి స్నేహితుడికి ఆ మహిళ సన్నిహితురాలేనని, ఫ్లాట్లోకి వెళ్లగానే ఆయనను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ మర్డర్ కోసం 5 కోట్ల సుపారీ ఇచ్చినట్టు తెలిపిన అధికారులు ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు.