స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతుల స్థితిగతులపై స్పందించిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ లో మండిపడ్డారు. వడ్లు మొలకెత్తి.. గుండె భారమై ఓ కౌలు రైతన్న ప్రాణం పోయింది. చనిపోతానని ముందే చెప్పినా.. ఆదుకోని అసమర్థ ప్రభుత్వమిది. కండ్లు ఉన్నా చూడలేని సర్కారు ఇది. చెవులు ఉన్నా వినలేని ప్రభుత్వమిది. కేసీఆర్ దొరకు.. రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు మాత్రం వద్దు. అంటూ ట్విట్టర్ లో మండిపడ్డారు.
ఓట్ల కోసం.. రైతు నినాదం కావాలి కానీ ఆదుకునే విధానం వద్దు. సిగ్గుపడు KCR.. సిగ్గుపడు. తొమ్మిదేళ్లలో తొమ్మిది వేల మంది రైతులను బలి తీసుకున్న కేసీఆర్.. మరో రైతు ప్రాణం తీసుకోకముందే ఇచ్చిన మాట ప్రకారం ఆఖరి గింజ వరకూ కొను. ఐకేపీ సెంటర్లు అన్ని తెరువు. క్వింటాలుకు 12 కిలోల తరుగు దోపిడీ ఆపు. తడిసిన వడ్లు సైతం కొను అంటూ కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం కనీసం రూ.10 వేలు నష్ట పరిహారం ఇవ్వు. ఇప్పటికే 2023లో దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా పంట బీమా కూడా లేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది.. అంటూ నిప్పులు చెరిగారు.