అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై ఎన్నడూ లేనంత చర్చ నడుస్తోంది. ఇందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహార శైలే కారణమని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారీస్ను బరిలో దింపాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పలు సర్వేల పోల్స్ కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాయి. దీంతో, అధ్యక్ష ఎన్నికల బరిలో ఎవరు ఉంటారనే చర్చ మొదలైంది.
సీఎన్ఎన్ పోల్ ప్రకారం.. నమోదైన ఓటర్లలో ట్రంప్నకు 47 శాతం ఓట్లు రాగా కమలా హరీస్కు 45 శాతం ఓట్లు వచ్చాయి. ఇందులో మహిళల ఓట్ల విషయంలో కమలా హారీస్ 50 శాతం ఓట్లు రావడం విశేషం. ఇదే సమయంలో బైడెన్కు 44 శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు మిచెల్లీ ఒబామాకు 37 శాతం ఓట్లు పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఇదిలా ఉండగా ఇటీవల ట్రంప్తో బైడెన్ డిబెట్ గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ట్రంప్ను ఢీకొనడంలో బైడెన్ విఫలమయ్యారని డెమోక్రటిక్ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో, ఆయన పోటీలో ఉంటారా? అనే చర్చ మొదలైంది. మరోవైపు.. ట్రంప్తో డిబెట్ సందర్భంగా తాను ఎందుకు సరిగా మాట్లాడలేదో క్లారిటీ ఇచ్చారు. ఈ తడబాటుకు గల కారణాన్ని బైడెన్ చెప్పుకొచ్చారు.
వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ తెలిపారు. ఈ పర్యటనల వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైంద న్నారు. అందుకే డిబెట్లో ట్రంప్తో సరిగా వాదించలేకపోయానన్నారు. చర్చలో తాను మరింత ధాటిగా మాట్లాడి ఉంటే బాగుండేదని చెప్పారు. అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు. దీన్ని సాకుగా భావించవద్దని.. కేవలం వివరణగా మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


