కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి డొంకను కదిలించేందు క్రమంలో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటి వరకూ సాంకేతిక లోపాలపై దష్టిసారించిన కమిషన్.. ప్రస్తుతం ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అధికారుల నుంచి వివరాలు రాబడుతోంది. ఇందులో భాగంగానే మాజీ సీఎస్, ఫైనాన్స్, ఇరిగేషన్ శాఖల మాజీ కార్యదర్శులను విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ సెక్రటరీలుగా పని చేసిన ఎస్కే జోషి, రజత్కుమార్, స్మితా సబర్వాల్ కు కమిషన్ నోటీసులు అందజేసినట్టు సమాచారం. అదే విధంగా ఆర్థికపరమైన అంశాలను తెలుసుకునేందుకు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సెక్రటరీలు వికాస్రాజ్, నాగిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. వీళ్లందరికీ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నోటీసులు పంపారని, ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
టెండర్లు పిలిచిన విధానం? ఎన్ని టెండర్లు వచ్చాయి? ఎన్ని కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి? ఏ ప్రాతిపదికన టెండర్లు ఇచ్చారు? కాంట్రాక్ట్లు ఇచ్చాక మళ్లీ సబ్కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలను అప్పగించాల్సిన అవసరమేంటి? తదితర అంశాలపై ఆరా తీస్తోంది కమిషన్. ఇక ఆర్థిక శాఖ అధికారుల నుంచి ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? ఆ తర్వాత అంచనా వ్యయాలు ఎంతమేర పెరిగాయి? ఎందుకు పెంచాల్సి వచ్చింది? కాంట్రాక్ట్సంస్థలకు ఎంత చెల్లించారు? సబ్కాంట్రాక్ట్సంస్థలకు చెల్లింపులు తదితర వివరాలను కూడా ఈ విచారణలో రాబట్టనుంది.