అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో జగన్ వివిధ జిల్లాల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఈనేపథ్యంలోనే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం బటన్లు నొక్కిన వైసీపీకే ఈ పరిస్థితి వస్తే.. ప్రజలను మోసం చేసి, ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంలోని వారి పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో ఘోర ఓటమితో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డి.. వివిధ జిల్లాల నేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచిందన్నారు. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైసీపీ పాలన సాగిందని చెప్పారు. లంచాలకు తావు లేకుండా 2.71 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి వేశామని తెలిపారు.
జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని వైసీపీ అధినేత మరోసారి స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ఇంటికి పెద్దన్నగా, అండగా ఉంటానని చెప్పారు. మరో 25 నుంచి 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. వైసీపీ పాలనలో రెండేళ్లు కోవిడ్ ఉందని..అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయామని చెప్పారు.
కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేశారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి, ఇంటింటికి వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పుకున్నారని..ఇప్పుడు అది బాబు షూరిటీ-మోసం గ్యారంటీ అయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో స్కామ్లు తప్ప మరేమీ జరగడం లేదన్నారు. దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప మరేమీ లేదని విమర్శించారు. యథేచ్ఛగా పేకాట క్లబ్లు నడుస్తున్నాయని చెప్పారు. ఇసుక, లిక్కర్ స్కాంలు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించేవారిని, అన్యాయాలు చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో మరిన్ని దొంగ కేసులు పెడతారని, అరెస్ట్లు చేస్తారని జగన్ అన్నారు. రాబోయే వైసీపీ ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తానని చెప్పారు. మొన్నటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ రెండే మున్సిపాలిటీలు గెలిచిందని..వైసీపీ గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండు కూడా పోయేవని చెప్పారు. ఇప్పుడు టీడీపీ తప్పుడు సంప్రదాయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
ప్రజలను మోసం చేసిన చంద్రబాబు చీటర్ కాదా..ఆయనపై 420 కేసు పెట్టకూడదా అని జగన్ ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని..10 శాతం ఓట్లు తగ్గడానికి కారణం తాను వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పకపోవడమేనని చెప్పారు. ప్రజల కోసం బటన్లు నొక్కిన వైసీపీకే ఈ పరిస్థితి వస్తే…ప్రజలను మోసం చేసి, ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంలోని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మళ్లీ రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, అందరూ ధైర్యంగా ఉండాలని నేతలకు జగన్ ధైర్యం చెప్పారు. పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లాల వారీగా నేతలతో వరస భేటీలు నిర్వహిస్తున్నారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అంటూ వారిలో ధైర్యం నింపుతున్నారు.