తెలంగాణలో 450 కోట్ల రూపాయల పెట్టుబడులకు క్యాపిటల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్లో అత్యాధునిక ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సింగపూర్లో ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కంపెనీ ఈ నిర్ణయం ప్రకటించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రచార శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, క్యాపిటల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీశంకర్ నాగభూషణం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతాని తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి సింగపూర్ పర్యటనలో ఇదొక ముందడుగుగా ప్రభుత్వం పేర్కొంది. సింగపూర్ కేంద్రంగా విస్తరించిన ఈ కంపెనీ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటి. హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్ను అభివృద్ధి చేయనుంది. క్యాపిటల్యాండ్ చేపట్టే కొత్త ఐటీ పార్కు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలు రాయిగా నిలుస్తుంది. ఈ సంస్థ నిర్ణయం ఆహ్వానించదగింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ను అందుకునేలా అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని కంపెనీ ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం అన్నారు. తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్లో అంతర్జాతీయ టెక్ పార్క్, అవాన్స్ హైదరాబాద్, సైబర్పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలోనే అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై.. 2028 నాటికి పూర్తి కానుంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు ఈ బృందం అక్కడ బిజీ బిజీగా గడిపింది. చివరి రోజైన ఆదివారం ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు నిర్వహించింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, ఛైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్ హార్ట్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్తో చర్చించింది. హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించింది. ఈ పర్యటనలో ఆశించిన పెట్టుబడుల ఒప్పందాలతో పాటు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవటం కీలక పరిణామం. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. 3 వేల 500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలకు సంబంధించి సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో మంత్రి శ్రీధర్బాబు నిర్వహించిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఆదివారం హైదరాబాద్లో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిట ల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది.
సింగపూర్ నుంచి ఆదివారం రాత్రి సీఎం రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్బాబు, అధికారులు దావోస్కు బయల్దేరి వెళ్లారు. నేటి నుంచి దావోస్లో నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి.. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాల్గొంటోంది. సింగపూర్ పర్యటన విజయవంతం కావటంతో ప్రభుత్వం దావోస్ సదస్సుపై భారీ అంచనాలు పెట్టుకుంది.