ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న చైనాను ఈ ఏడాది మధ్యలో భారత్ దాటనుందని ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్’ 2023 నివేదికలో ఐక్యారాజ్యసమితి తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 142.85కోట్లు లేదా 142.86కోట్ల జనాభాతో ఇండియా తొలి స్థానం దక్కించుకుంటుందని అంచనా వేసింది. 142.57కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో.. 340మిలియన్ల జనాభాతో అమెరికా మూడవ స్థానంలో ఉంటాయంది.
2023ఫిబ్రవరి వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి ఈ నివేదిక తయారుచేసినట్లు పేర్కొంది. అయితే గత నివేదికలో ఈ నెలలోనే చైనా జనాభాను భారత్ దాటిపోతుందని అంచనా వేయగా.. తాజా రిపోర్టులో మాత్రం ఏ నెలలో దాటుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. 2011తర్వాత ఇండియాలో జనగణన జరగలేదని.. దీంతో ఇప్పుడే చెప్పలేమని చెప్పింది. 1960 తర్వాత చైనాలో జనాభా తగ్గడం ప్రపంచంలో అనేక మార్పులు తీసుకురానుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.