మోదీ సర్కార్పై సీపీఐ నేత రామకృష్ణ ధ్వజం
గతంలో నల్ల చట్టాలను ఉపసంహరించుకున్న బీజేపీ.. మళ్లీ అవే చట్టాలను తెరపైకి తెచ్చిదంటూ మోదీ సర్కార్పై ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీజేపీ తీరుకు వ్యతరేకంగా రేపు దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నారని.. వారికి సీపీఐ సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు. రైతుల ప్రధాన డిమాండ్ అయిన స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలన్నారు. CAAని తెచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందువుల ద్వారా లబ్ది పొందేందుకు మత రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో లేఖను విడుదల చేశారు. కాపు నాయకులకు, ప్రజలకు ముద్రగడ పద్మనాభం క్షమాపణ కోరుతూ లేఖ రాశారు. సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. మళ్లీ జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని తెలి పారు. తమ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకుంటున్నానని చెప్పారు. పేదవారిని మరెన్నో సంక్షేమ పథకాలతోపాటు, వీలైనంత అభివృద్ధి చేయించాలని ఆశతో ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.
రామభక్తులకు శుభవార్త
రామ భక్తులకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ శుభవార్త అందించింది. ఏప్రిల్ రెండు నుంచి హైదరాబాద్ టు అయోధ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది. బోయింగ్ 737 విమానాలను ఏప్రిల్ 2 నుంచి మంగళ, గురు, శనివారాల్లో వారంలో మూడు సార్లు విమానాలను నడపనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
వివాదాస్పద వ్యాఖ్యలు
స్టాలిన్ సర్కార్ మహిళలకు పంపిణీ చేస్తున్న వెయ్యి రూపాయల పథకంపై జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు, నటి కుష్బు చేసిన వ్యాఖ్యలు తమిళనాట వివాదాస్పదమయ్యాయి. ఓట్ల కొసం మహిళలకు వెయ్యి ముష్టి వేస్తున్నారని కుష్బు అనడం వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలపై డీఎంకే మహిళా విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. కుష్బు దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది.
పొగ పీల్చినవారే అధికులు
పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం మాట ఎలా ఉన్నా ఆ పొగను పీల్చేవారికే ప్రమాదం అంటూ నివేదిక లు హెచ్చరిస్తున్నాయి. నో స్మోకింగ్ డే రోజైన నేడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను పరిశీలిస్తే… ధూమపా నం వల్ల ప్రతీ ఏడాది 80 లక్షల మందికి పైగా మరణిస్తుండగా, వీరిలో 13 లక్షల మంది సిగరెట్ పొగను పీల్చినవారే ఉండటం గమనార్హం.
వరుస దొంగతనాలు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్ గా మారాయి. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న 6 దుకాణాల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు విలువైన వస్తువుల్ని, నగదును దోచుకెళ్లారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వరుస చోరీలపై వికారాబాద్ పోలీసులు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
బలవన్మరణం
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ శివారులోని సుల్తాన్ పూర్ వాగులో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాగుపై ఉన్న బ్రిడ్జి రేలింగ్ కు తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు నాయికోటవాడకు చెందిన 53ఏళ్ల కుర్వ చిన్న నర్సింలుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
శిశువు మృతదేహం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. శేష్మహల్ వెనుక వీధిలో ఉన్న సచివాలయం వద్ద చెత్త కుండీ వద్ద శిశువు మృతదేహం లభ్యమైంది. ఉదయం చెత్త ఏరుకొనేవారు గమనించి స్ధానికులకు చెప్పడంతో ఘటనాస్ధలానికి చేరుకున్న పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు
పోలేరమ్మ హుండీ చోరీ
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట పోలేరమ్మ గుడిలోని హుండీ చోరీకి గురైంది. హుండీ ని పక్కన ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి పగలగొట్టి నగదుతో ఉండాయించారు దొంగలు. ఆలయంలోని
సీసీ కెమెరాలతో పాటు, హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లారు. ఉదయం గుడికి వచ్చిన పూజారి చోరీ విషయాన్నిగ మనించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి చేసుకున్న మీరా చోప్రా
బంగారం సినిమాలో నటించి మెప్పించిన హీరోయిన్ మీరా చోప్రా ప్రముఖ వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్ను వివాహం చేసుకుంది. జైపూర్లో వీరి వివాహం అట్టహసంగా జరగ్గా ఎరుపు రంగు లెహంగాలో మీరా మెరిసిపోయింది. రక్షిత్ ఐవరీ షేర్వానీలో మెరిశాడు. ప్రస్తుతతం వీరిరువురి మ్యారేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అధికారుల అలసత్వం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీలాద్రీ అర్బన్ పార్క్ లోకి అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యంతో వీధి కుక్కలు ప్రవేశించాయి. చుక్కల దుప్పిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. ఇప్పటికే వీధి కుక్కల దాడిలో పార్క్లోని దుప్పిలు పదుల సంఖ్యలో మృత్యువాతపడటంపై జంతుప్రేమికులు, స్ధానికులు మండిపడుతున్నారు.