సీఎంకి రుణపడి ఉంటా – నీలం మధు
ప్రజల తీర్పును గౌరవిస్తాం అని మెదక్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సంగారెడ్డి జిల్లా మెదక్ పార్లమెంటరీ స్థానం పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటి లాగానే తాను ప్రజల మధ్యే ఉంటానని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని మధు చెప్పారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డికి రుణపడి ఉంటానని నీలం మధు అన్నారు.
అమర్ నాథ్ రెడ్డి ఘన విజయం
చిత్తూరు జిల్లా పలమూరు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి, టీడీపీ నేత అమర్నాథ్రెడ్డి ఘన విజయం సాధించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను భరించలేక ఇన్ని సీట్లు కూటమికి ఇచ్చిన ప్రజలకు ఆయన అభివందనాలు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 12 సీట్లు రావడం సాధారణ విషయం కాదన్నారు. ప్రజల తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వృథా చేయబోమని అమర్నాథ్రెడ్డి అన్నారు.
రాష్ట్రాన్ని రక్షించుకున్నాం – చదలవాడ
ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని బయటకు వెలికితీశామని పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు చెప్పారు. వైసీపీ గూండాల నుండి రాష్ట్రాన్ని రక్షించుకు న్నాం అన్నారు. పల్నాడు జిల్లాలో ఎంపీతో పాటు ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలు గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ కష్టంతోనే తామంతా గెలిచాం అని అరవిందబాబు అన్నారు.
వైసీపీ అభ్యర్థికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల వార్నింగ్
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బొజ్జల సుధీర్రెడ్డి వైసీపీ అభ్యర్థి మధుసూదన్రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. మూడు నెలల్లో మధుసూదన్రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆయన 62 వేల 500 ఓట్ల మెజారిటీతో గెలిచారు. డీ ఫారం అందుకున్న తర్వాత సుధీర్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
టీడీపీ సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోయింది. విజయం సాధించిన అభ్యర్థుల తరఫున ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి విజయం సాధించారు. దీంతో యాడికి మండలం గుడిపాడు గ్రామంలో తెలుగుదేశం నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి.
జనసేన అభ్యర్థుల సంబరాలు
ఏపీలో జనసేన పార్టీ అభ్యర్థులు నూరుశాతం ఫలితాలు సాధించారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ లో జనసేన విద్యార్థి విభాగం సంబరాలు జరిపింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. వైసీపీ గుర్తు సీలింగ్ ఫ్యాన్కు విద్యార్థులు ఉరివేశారు.
టీడీపీ అభిమానుల సంబరాలు
ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో కూకట్పల్లిలో TDP అభిమానుల సంబరాలు చేశారు. HYDలో ఎటు చూసినా టీడీపీ అభిమానులు, నాయకులు సంబరాల్లో మునిగితేలారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూకట్పల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ రామోజీ శివకుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకు లు, కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ సంబరాలు జరిపారు.
టీడీపీ , వైసీపీ మధ్య ఘర్షణ
అనంతపురం జిల్లా గుత్తి మండలం టీ కొత్తపల్లిలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణ పడ్డారు. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేశారు. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం కట్టెలతో కొట్టుకొన్నారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమం కావడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం పలుదేవరలపాడులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిందనే ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న ఆ పార్టీ నాయకు లపై వైసీపీ వర్గాలు దాడి చేశాయి. కత్తులు, కర్రలతో వైసీపీ నాయకులు దాడిచేశారు. గాయపడ్డ వారిని సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పటల్కి చికిత్స కోసం తరలించారు.