అసోంలోని సిల్చార్లో అగ్నిప్రమాదం
అసోంలోని సిల్చార్లో అగ్నిప్రమాదం జరిగింది. కంప్యూటర్ ఇన్ట్సిట్యూట్లో మంటలు చెలరేగాయి. తరగతి గదిలోనే విద్యార్థులు చిక్కుకుపోయారు. భయంతో కొందరు విద్యార్థులు కిటికీలోంచి దూకేశారు. పరిస్థితిని పోలీసు అధికారులు సమీక్షిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. సంఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భక్తుల కోసం సోలార్ పవర్తో నడిచే వాహనాలు అవసరం- అశోక్ గజపతిరాజు
భక్తుల కోసం సోలార్ పవర్తో నడిచే వాహనాలు అవసరం అని సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు. అందుకే సోలార్ పవర్తో నడిచే రెండు బస్సులను కొనుగోలు చేసి దేవస్థానానికి అందించామన్నారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో ఎలక్ట్రిక్ బస్సులను అశోక్ గజపతిరాజు, ఈఓ శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఈ బస్సులకు ప్రస్తుతం చార్జీలు పెంచే యోచన లేదని స్పష్టం చేశారు. ఈ బస్సుల పనితీరును పరిశీలించి, కాలుష్యం లేని మరిన్ని వాహనాలు కొంటామని చైర్మన్ అశోక్ గజపతిరాజు తెలిపారు.
ఒంగోలులో వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అల్లర్లు జరగవచ్చనే సమాచారంతో బైకులపై ఓవర్ రైడ్, ఓవర్ సౌండ్తో పొల్యూషన్కు పాల్పడుతున్న యువకులను, బైకులను గుర్తించి వాటి పేపర్లను పరిశీలించారు. ర్యాలీలు, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే యువతకు సంబంధించిన బైకుల పేపర్లను ప్రత్యేకంగా పరిశీలించారు. సరైన పేపర్లు లేకుండా నడుపుతున్న వాహనాలను సీజ్ చేశారు. అనుమతులు లేని హెవీ సౌండ్ సైలెన్సర్లపై చర్యలు తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు సీఐ జగదీష్ తెలిపారు. అల్లర్లు, ధర్నాలు, ర్యాలీలలో పాల్గొనే యువత తమ వాహనాలకు సరైన పేపర్లు కలిగి ఉండాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని సీఐ జగదీష్ హెచ్చరించారు.
బస్సు కిందపడి మహిళ మృతి
ఖమ్మం జిల్లా కొణిజర్ల ఎంపీడీఓ ఆఫీసు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది. బస్సులో నుండి జారి కింద పడిన దూరి అనూష పైనుండి బస్సు వెనుక టైర్ ఎక్కడంతో అక్కడికక్కడే మరణించింది. అనూషది పెద్దమనగాల గ్రామం. వ్యవసాయ కూలి కుటుంబానికి చెందిన అనూష ఖమ్మం డి మార్ట్లో పనిచేస్తోంది. డి మార్ట్కు వెళ్లేందుకు ఆమె భద్రాచలం డిపో బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఫుట్బోర్డు మీద ఉన్న అనూష జారి కింద పడిందని స్థానికులు తెలిపారు.
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
కొమురం భీం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకు న్నారు. వాంకిడి చెక్పోస్ట్ వద్ద సిరిసిల్ల నుండి మహారాష్ట్రను ఐచర్ వాహనంలో తరలిస్తున్న సుమారు 10టన్నుల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాజ్ కుమార్ సీజ్ చేశారు. రేషన్ బియ్యంతో పాటు ఐచర్ వాహనాన్ని సీజ్ చేసి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రుద్రంగిలో చిరుత కలకలం
కరీంనగర్ జిల్లా రుద్రంగిలో చిరుతపులి కలకలం రేపింది. గోరిలాల్వ, నల్లగుంట ప్రాంతంలోని గంగాధర్ అనే రైతుకు చెందిన గేదె దూడపై దాడి చేసి చంపింది. గేదె దూడను గుడిసెలో కట్టేసి ఉంచామని రాత్రి సమయంలో చిరుత దాడి చేసి చంపిందని రైతు తెలిపాడు. అదే విధంగా గుడిసె చుట్టూ చిరుత కాలి వేలిముద్రలు కనిపించాయన్నారు. చిరుత సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
సైబర్ నేరగాళ్ల బురిడీ
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు యువకుడు ఇబ్రహీం ఖాతాలోని డబ్బులను సైబర్ కేటుగాళ్ళు కొట్టేశారు. యూనియన్ బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ పాయింట్ నిర్వహిస్తున్న ఇబ్రహీం సెల్ను సైబర్ నేరగాళ్ళు హ్యాక్ చేశారు. అతని ఖాతాలోని 7 లక్షల రూపాయలు కాజేశారు. తన ఖాతాలో డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ వచ్చిన వెంటనే పోలీసులకు ఇబ్రహీం ఫిర్యాదు చేశాడు. మళ్లించిన డబ్బులు హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఖాతాలుగా పోలీసులు గుర్తించారు. ఆ ఖాతాలను ఫ్రీజ్ చేసి, 2 లక్షలు నగదును తిరిగి రప్పించారు.
ఫారెస్ట్ అధికారులు తనిఖీలు
అల్లూరి జిల్లా పోతవరం సీతారాం గ్రామ సమీపంలో ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చారు. అనుమ తులు లేకుండా ఓ రైతు పొలంలో నరికిన 47 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రైతులు వారీ భూముల్లో ఉన్న చెట్లను ఏ విధమైన అనుమతులు లేకుండా నరకరాదన్నారు అధికారి దుర్గ కుమార్. చెట్లు నరకాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. పట్టుబడిన టేకు దుంగలు కొలతల అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ టింబర్ డిపోకి తరలిస్తామన్నారు.