తిరుమలో భక్తుల రద్దీ
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివార్ని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి దాదాపు 30 గంటల పైగా సమయం పడుతోంది. కాగా శుక్రవారం ఒక్కరోజే 76 వేల మంది భక్తులు మలయప్ప స్వామివారిని దర్శించుకున్నారు. వారాంతపు సెలవులు కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు.
తెలంగాణ EAP సెట్ ఫలితాలు
తెలంగాణ EAP సెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేసారు, ఇంజనీరింగ్ విభాగంలో 2 లక్షల 40 వేల 618 విద్యార్ధులు, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 91వేల 633 విద్యార్ధులు హజరయ్యారు. ఇంజనీరింగ్లో ప్రధమ, ద్వితీయ ర్యాంక్లను శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన జ్యోతిరాదిత్య, కర్నూలు జిల్లా పంచలింగాలుకు చెందిన హర్ష సాధించారు.
ఆళ్లగడ్డలో ఆ ఇద్దరి అరెస్ట్
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సెక్యూరిటీ గార్డ్ నిఖిల్ పై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దర్ని అరెస్టు చేసారు ఆళ్లగడ్డ పోలీసులు. రవి, నూలి అశోక్ అనే ఇరువుర్ని అదుపులోకి తీసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్. డీఎస్పీతోపాటు సీఐ రమేష్ బాబు, ఎస్సై నగీనా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
రిషి సునాక్
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తిలు మరింత సంపన్నులయ్యారు. సండే టైమ్స్ సంపన్నుల జాబితాలో గతేడాది 275 స్ధానంలో ఉన్న ఈ జంట, ఈ ఏడాది సుమారు 6వేల 873 కోట్ల సంపదతో 245వ స్ధానానికి చేరింది. 2022-23లో రిషి సునాక్ సుమారు 23కోట్లు సంపాదించగా, ఆయన సతీమణి అక్షతామూర్తి డివెడెండ్ల రూపంలో ఏకంగా 137 కోట్లు అందుకున్నారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
ఆగ్నేయ ఆసియాలో 29.4 కోట్లకు పైగా ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ – WHO పేర్కొంది. రక్తపోటును నియంత్రించడానికి పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరముందని సూచించింది. మీ రక్తపోటును కచ్చితత్వంతో తెలుసుకోండి… దానిని నియంత్రించి ఎక్కువ కాలం జీవించండి అనే థీమ్ను ఈ ఏడాది WHO సూచించింది.
ఎలన్ మస్క్ ట్వీట్
అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవించే సమయం అతి దగ్గర్లో ఉందన్నారు స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. మరికొన్ని సంవత్సరాల్లో మనం అంగారకుడిపై అడుగుపెడతాం అని ఓ ఎక్స్ యూజర్ చేసిన పోస్ట్కు స్పందించిన ఆయన ఐదేళ్లలోపే ఈ గ్రహంపైకి మానవరహిత యాత్ర విజయవంతంమౌతోందన్నారు. 20 ఏళ్లలో ఓ నగరాన్ని నిర్మిస్తాం.. కచ్ఛితంగా వచ్చే 30 ఏళ్లకు అక్కడ నాగరికత విరాజిల్లుతుందంటూ రాసుకొచ్చారు.
బ్లూ రెసిడెన్సీ వీసా
ప్రకృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న వ్యక్తుల కోసం బ్లూ రెసిడెన్సీ వీసాను జారీ చేయనుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ వీసా పొందిన వారు UAEలో పదేళ్లపాటు నివాసం ఉండేందుకు అనుమతి ఉంటోంది. అక్కడి పర్యావరణ ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యేందుకు అవకాశం లభిస్తోంది.
కియా కంపెనీ అద్దెకు వాహన సేవలు
లీజు పద్దతిన కొత్త కారును తీసుకునేలా కియా లీజ్ సేవ వాహన ప్రియులకు చేరువకానుంది. కియా ఇండియా ఈ మేరకు ఓరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్తో ఒప్పందానికి వచ్చింది. హైదరాబాద్ సహా డిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, పుణేలలో అందుబాటులోకి రానున్న ఈ లీజ్ సేవ ద్వారా వాహనాన్ని రెండేళ్లు, ఐదేళ్ల ప్రాతిపదికన తీసుకుని వినియోగించుకోవచ్చు.
ఇంటిముఖం పట్టిన ముంబాయి జట్టు
ఐపీఎల్ సీజన్ -17 లో ముంబయి జట్టు కధ ముగిసింది. పలుమార్లు టీట్వంటీ కప్పును ముద్దాడిన ఆ జట్టు ఈసారి ప్లేఆప్స్కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది . ముంబయి అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ముంబయితో వాంఖేడ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 18పరుగుల తేడాతో విజయా న్ని అందుకున్న LSG జట్టు కూడా పేలవమైన రన్రేట్ కారణంగా ప్లే ఆప్స్ అవకాశాలను పొగొట్టుకుంది.
ఒలింపిక్ బెర్తు
ప్రపంచ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత బాక్సర్ పర్వీన్ హుడాపై నాడా నిషేధం విధించడంతో బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తును కోల్పోయింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘనతో పర్వీన్పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్ధ – వాడా 22 నెలల పాటు నిషేధం విధించింది. దీంతో బ్యాంకాక్లో ఈనెల 24న ఆరంభమయ్యే ఒలింపిక్ క్వాలిఫయర్స్ 57 కేజీల విభాగంలో ఆమె స్ధానంలో మరో బాక్సర్ను పోటీలో దింపనుంది సమాఖ్య.