బీజేపీ అభ్యర్థి మాధవీ లత
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మాధవి లత ఒవైసీ బ్రదర్స్పై మండిపడ్డారు. మైనార్టీ ఓట్లను దండుకునేందు కు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఐ ఎస్ సదన్ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆమె పాతబస్తీ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమన్నారు.
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపు
చేవెళ్ల ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకొరకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలంటూ పిలుపు నిచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. తుక్కుగూడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసారు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కెసీఆర్కు ఒక కానుక కావాలన్నారు సబితా.
బీఆర్ఎస్ నేత నోట జై కాంగ్రెస్
వరంగల్ లోక్సభ ఎన్నిక సన్నాహక సమావేశం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. సమావేశంకు హాజరైన బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రసంగం ముగింపులో జై కాంగ్రెస్ అంటూ స్లోగన్ ఇచ్చి అందర్నీ విస్మయానికి గురిచేసారు. తప్పు తెలుసుకుని తల బాదుకున్నంత పని చేసారు.
టీడీపీ రెబల్ ఇంటూరి రాజేష్
కందుకూరు నియోజకవర్గం టీడీపీ రెబల్ అభ్యర్థి ఇంటూరి రాజేష్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పాల్గొన్నారు. అలగాయపాలెం మత్సకార గ్రామం నుండి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించిన రాజేష్ వెంట శివరాం నడిచారు. ప్రజల కష్టసుఖాల్లో రాజేష్ చేదోడుగా ఉంటాడంటూ ఓట్లను అభ్యర్ధిం చారు శివరాం.
చంద్రబాబు జన్మదిన వేడుకల్లో జీవీ
చంద్రబాబు పాలనే నవ్యాంధ్రప్రదేశ్కు శ్రీరామరక్ష అన్నారు టీడీపీ నేత జీవీ ఆంజనేయులు. పల్నాడు జిల్లా వినుకొండలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి
కేక్ కట్ చేసిన ఆంజనేయులు. పేదరికంలేని ఏపీని సాధించి చూపడమే చంద్రబాబు ధ్యేయమన్నారు.
ఈటల గెలుపుకు ఏనుగుల కృషి
ఈటల రాజేందర్ విజయమే లక్ష్యంగా కృషిచేస్తానన్నారు బిజెపి సీనియర్ నేత ఏనుగుల తిరుపతి. బీఆర్ఎస్కు రాజీనామా చేసి ఇటీవల బీజేపీలో చేరిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు చేసిన తమకు గుర్తింపులేనందునే బీఆర్ఎస్ను వీడాల్సివచ్చిందన్నారు.
జీవీ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
పల్నాడు జిల్లా ఈపూరు మండలంకు చెందిన పలువురు ప్రముఖులు టీడీపీలో చేరారు. వైసీపీలో ఇమడ లేక ఆ పార్టీని వీడిన వీరంతా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకు న్నారు. సంఘం డైరీ ప్రెసిడెంట్ భోగి రెడ్డి తిరుపతి రెడ్డితోపాటు పలువురు నేతలు వైసీపీని వీడిన వారిలో ఉన్నారు.
చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాష్యం ప్రవీణ్
రాష్ట్రాభివృద్దిని కాంక్షించి వచ్చే ఎన్నికల్లో టీడీపీ పట్టం కట్టాలన్నారు పెదకూరపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్ధి భాష్యం ప్రవీణ్. చంద్రబాబు 74వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన రాజధానిగా అమరావతి కొనసాగాలంటే చంద్రబాబు సీఎం కావడం ఒక్కటే మార్గమన్నారు.
అనిల్ కుమార్ రోడ్ షో
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ లో ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఇళ్ళ లబ్దిదారులకు బకాయిపడ్డ 26 కోట్ల రూపాయల విషయమై మంత్రి తీరును తప్పుపట్టారు. సమస్య పరిష్కారం కానీ పక్షంలో తన భార్యతో కలసి ధర్నా చేస్తానంటూ హెచ్చరించారు.
పాటిల్ కు మద్దతుగా ఈటల
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్ధి బీ బీ పాటిల్కు మద్దతుగా బీజేపీ ర్యాలీ చేపట్టింది. అనంతరం బీజేపీ ఓబిసి మోర్చా ఆత్మీయ సమ్మేళనం లో ఇరువురు నేతలు పాల్గొన్నారు. ముచ్చటగా మూడోసారి ఎంపీగా బీబీ పాటిల్, ప్రధానిగా మోదీ గెలవడం ఖాయమన్నారు ఈటల.
ఓటు విలువ చెప్పిన రోనాల్డ్ రోస్
ప్రజాస్వామ్య వ్యవస్ధ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలన్నారు GHMC కమీషనర్ రోనాల్డ్ రోస్. జిహెచ్ఎం సి కార్యాలయంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధు లతో సమావేశమయ్యారు. ఓటు ప్రాధాన్యత, సి-విజిల్ యాప్, తదితర అంశాలపై అవగాహన కల్పించా రు.
నాగార్జున సాగర్ పంపింగ్ ప్రారంభం
నాగార్జున సాగర్ నుండి 10 పంపుల ద్వారా చేపట్టే నీటి పంపింగ్కు శ్రీకారం చుట్టారు జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి. అవసరమైతే రెండో దశ పంపింగ్కు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మే 15 నుంచి ఎల్లం పల్లి రిజర్వాయర్లో కూడా పంపింగ్ ప్రారంభిస్తామన్న ఆయన తాగునీటి అవసరాలకు ఎటువంటి ఢోకా లేదన్నారు.
అగ్నిమాపక వారోత్సవాల ముగింపు
వరంగల్లో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్, ఎసీపీ నందిరాంలు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణపై ప్రజల్లో వారం రోజులపాటు అవగాహన కల్పించిన అధికారులు వీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిభ ప్రదర్శించిన సిబ్బందిని అభినందించారు.
అకాల వర్షాలు .. రైతుల ఇక్కట్లు
జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలకు అపార నష్టం వాటిల్లింది. నేలపోగుల గ్రామంలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. యాదయ్యకు చెందిన ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో అగ్నికి ఆహుతైంది.
ప్రేమజంట ఆత్మహత్యా యత్నం
ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పల్ దరి గ్రామంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ప్రియురాలు బోరిక కవిత మృతి చెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలోని పొలం వద్ద తాళిబొట్టు బంధంతో ఒక్కటైన వీరు పురుగుల మందు తాగారు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


