ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్
తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న బాసగూడలో ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ముగ్గురిని హత్య చేయడం కలకలం రేపింది.
భారీ మెజార్టీతో గెలుస్తా – టీడీపీ అభ్యర్థి వనమాడి
కాకినాడ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు. దౌర్జన్యాలతో ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడ పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆయన మండిపడ్డారు. ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఓడిపోవడం ఖాయమని తేలడంతో మేకపోతు గాంభీర్ ప్రదర్శిస్తూ ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించి వైసీపీని ఇంటికి పంపించాలంటున్న వనమాడి వెంకటేశ్వరరావు.
టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ఎన్నికల ప్రచారం
మట్టితోపాటు తాగునీటిని కూడా పేర్ని నాని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర. పేర్ని నాని పట్టించుకోకపోవడంతోనే మచిలీపట్నంలో తాగునీటి సమస్య తీవ్రతరం అయిందని ఆయన విమర్శించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో తాము తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాయని గుర్తు చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినవెంటనే తాగునీటి సమస్యను గాలికి వదిలేశారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
చిలకలూరిపేటలో వైసీపీ గెలుపు తథ్యం- మనోహర్ నాయుడు
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ గెలుస్తుందని అభ్యర్థి మనోహర్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. సిద్ధం సభకు 12 లక్షల మంది హాజరయ్యారని అన్నారు. చిలకలూరిపేటలో మూడు పార్టీలు కలిసి నిర్వహించిన సభ అట్టర్ ఫెయిల్ అని ఆయన విమర్శించారు. ఈనెల 30న చిలకలూరిపేటలో కార్యకర్తల సమావేశం నిర్వహించి, మరుసటి రోజు నుండి ప్రచారం ప్రారంభిస్తార తెలిపారు. వైఎస్ జగన్ ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా చేశారని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చెప్పారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలి- వికారాబాద్ కలెక్టర్
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. వికారాబాద్ ఎన్నెపల్లి చౌరస్తా నుండి అలంపల్లి చౌరస్తా వరకు I VOTE FOR SURE నినాదంతో 5కే రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి జెండా ఊపి 5కే రన్ను కలెక్టర్ ప్రారంభించారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు.
వాలంటీర్లు రాజీనామా చేసిన తర్వాత ఈసీ పరిధిలోకి రారు- జేసీ
వాలంటీర్లు తమ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల సంఘం పరిధిలోకి రారని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. వాలంటీర్లపై సోషల్ మీడియాలో ఇటీవల వచ్చిన ఒక ప్రకటనపై శ్రీనివాసులు స్పందించారు. వాలంటీర్లు పదవికి రాజీనామా చేసిన తర్వాత వారిపై కేసులు నమోదు చేస్తామని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వచ్చింది. వాలంటీర్లు రాజీనామా చేసిన తర్వాత వారు స్వేచ్ఛాయుత పరిధిలోకి వస్తారని తెలిపారు.
‘ఆర్యవైశ్య ద్రోహి.. వెల్లంపల్లి శ్రీను’ కరపత్రం విడుదల
‘ఆర్యవైశ్య ద్రోహి.. వెలంపల్లిశ్రీను’ కరపత్రాన్ని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ విడుదల చేశారు. విజయవాడ వెస్ట్లో ఉండాల్సిన చెత్తను జగన్ తీసుకొచ్చి సెంట్రల్లో వేశారని ఆయన విమర్శించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్య వైశ్యులకు వెల్లంపల్లి చేసిన ద్రోహాన్ని కరపత్రం రూపంలో విడుదల చేసి నట్లు రాకేష్ వెల్లడించారు. తాము విడుదల చేసిన 10 అంశాలపై వెల్లంపల్లి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ను సెంట్ర్ నియోజకవర్గం ప్రజలు చిత్తుగా ఓడిస్తారన్నారు.
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి అవమానం
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో మంత్రి ముందే జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మికి అవమానం జరిగింది. కనీస మర్యాదగా తనకు కుర్చీ ఇవ్వకుండా అవమానిస్తున్నారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఇలా అవమానిస్తుంటే భరించలేకపోతున్నానని లక్ష్మి విచారం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను పోలీసుల నుంచి ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నానని ముద్దం లక్ష్మి వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా తనను అవమానించడం బాధగా ఉందన్నారు ముద్దం లక్ష్మి.