స్వతంత్ర వెబ్ డెస్క్: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express)ను నేడు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి బయల్దేరాల్సిన రైలును సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు చెప్పారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. వందేభారత్ రద్దు సమాచారాన్ని ఉదయం 5 గంటల నుంచి ప్రయాణికులకు చేరవేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఉదయం 7 గంటలకు మరో రైలును ఏర్పాటు చేశామని.. వందేభారత్ స్టాపుల్లోనే అది ఆగుతుందని తెలిపారు. వందేభారత్ రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్- విశాఖ వందేభారత్ కూడా..
మరోవైపు సికింద్రాబాద్ నుంచి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ బయల్దేరాల్సిన వందేభారత్ కూడా రద్దయింది. సాంకేతిక కారణాలతో దాని స్థానంలో ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ప్రయాణికులకు చేరవేశామని తెలిపింది. ఒకవేళ టికెట్ను రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని పూర్తిగా రీఫండ్ చేస్తామని స్పష్టం చేసింది. వందేభారత్కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన ఈ రైలులో వెళ్లే ప్రయాణికులకు టికెట్ ధరలో వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది. వందేభారత్లో ఉండే విధంగానే ఈ రైలులోనూ క్యాటరింగ్ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది.